నాకు ప్రధాని పదవి అక్కర్లేదు.. బిహార్ సీఎం కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
నాకు ప్రధాని పదవి అక్కర్లేదు.. బిహార్ సీఎం కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే సార్వత్రిక ఎన్నికలపై బిహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు కలిసి పోరాటం చేస్తే 2024 ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్లు కూడా రావని అన్నారు. శనివారం పాట్నాలో జరిగిన సీపీఐ-ఎంఎల్‌ జాతీయ సదస్సులో పలువురు జాతీయ స్థాయి నేతలు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ మాట్లాడుతూ.. విపక్షాలను ఏకం చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలని, అవసరమైన చర్చలు ప్రారంభించాలని సూచించారు. భారత్ జోడో యాత్ర వంటి భారీ కార్యక్రమం అనంతరం విపక్షాల ఐక్యత విషయంలో కాంగ్రెస్ పార్టీ త్వరతిగతిన నిర్ణయం తీసుకోవాలని జాప్యం చేయవద్దని అన్నారు. వ్యక్తిగతంగా తనకు ప్రధాని పదవిపై కోరిక లేదని స్పష్టం చేశారు.

మేము మార్పును మాత్రమే కోరుకుంటున్నామని సమిష్టిగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అంగీకారమే అన్నారు. గతంలో ఢిల్లీకి వెళ్లి సోనియా, రాహుల్ గాంధీలను కలిశాం. విపక్షాలు ఏకమేతై బీజేపీని ఓడించడం సులభమే అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ కొన్నిసార్లు ప్రేమలో కూడా సమస్యలు ఉంటాయని కూటమిలో విబేధాలు ఉంటే సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీల అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుని ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. ఎక్కడ బీజేపీతో ప్రత్యక్ష పోటీ ఉంటుందో అక్కడ కాంగ్రెస్ పోరాడాలని సూచించారు.

కేసీఆర్‌కు షాక్ తప్పదా?:

నితీష్ కుమార్ చేసిన తాజా ప్రకటనతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు షాక్ తప్పదా అనే చర్చ తెరపైకి వస్తోంది. బీఆర్ఎస్ పేరుతో నేషనల్ పాలిటిక్స్ ప్రారంభించిన కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ ఒక్క తాను ముక్కలే అని విరుచుకుపడుతున్నారు. ఈ రెండు పార్టీల పుణ్యమా అని దేశాభివృద్ధి కుంటుపడిందని పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో నితీష్ కుమార్, తేజస్వి యాదవ్, కుమారస్వామి, స్టాలిన్, హేమంత్ సోరెన్, కేజ్రీవాల్ వంటి నేతలతో సన్నిహితంగా ఉంటున్నారు. పలు సందర్భాల్లో వీరిని కేసీఆర్ ఆహ్వానించడం లేదా కేసీఆరే స్వయంగా వారి రాష్ట్రాల్లో పర్యటించి సమావేశం అవ్వడం జరిగింది.

ఈ క్రమంలో కేసీఆర్ కు సన్నిహితుడిగా చెప్పబడుతున్న నితీష్ కుమార్ విపక్షాల కూటమికి కాంగ్రెస్ లీడ్ తీసుకోవాలని కోరడం సంచలనంగా మారింది. ఈ పరిణామంతో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది చర్చగా మారుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ తో కలిసి సాగేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇతర విపక్ష పార్టీలతో కలిసి కాంగ్రెస్ తో కలిసి నడుస్తారా లేక కేజ్రీవాల్ తో కలిసి సెపరేట్ ఎజెండాతోనే వెళ్తారా అనేది ఉత్కంఠగా మారింది.

Next Story