కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా జగన్ నిర్ణయం!

by Disha Web Desk 2 |
కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా జగన్ నిర్ణయం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అక్కడెక్కడో యుద్ధం వస్తే ఇక్కడ మన దేశంలో ధరలు పెరిగినట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఇరుకున పెట్టనుందా?. ఇప్పుడిదే సందేహం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.. రాష్ట్ర విభజన అనంతరం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పాలన వ్యవహారాల అంశాల్లో ఏపీ, తెలంగాణ మధ్య పోల్చి చూడడం పరిపాటిగా మారిపోయింది. ఏపీలో కంటే తెలంగాణలోనే మౌళిక వసతులు బెటర్ గా ఉన్నాయంటూ గతంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఈ ఇష్యూలో ఇరు రాష్ట్రాల మంత్రులు నోటికి పని చెప్పారు. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ సీఎం జగన్ తీసుకోబోతున్న ఓ నిర్ణయం ఎన్నికల ముంగిట్లో సీఎం కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయనే చర్చ మొదలైంది.

మంత్రివర్గ విస్తరణకు జగన్ రెడీ:

ఓ వైపు పరిపాలనపై దృష్టి సారిస్తూనే మరోవైపు రాబోయే ఎన్నికల కోసం పార్టీ నేతలను జగన్ సమాయత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు గట్టిగా తిప్పి కొట్టాలని సూచిస్తున్నాయి. అయితే ఈ విషయంలో కొంత మంది మంత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విషయం జగన్ దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మరికొంత మంది మంత్రులు బాధ్యతలు స్వీకరించి నెలలు గడుస్తున్నా తమ శాఖపై పట్టు సాధించలేకపోతున్నారని జగన్ మండిపడినట్లు తెలుస్తోంది. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మంత్రుల పోస్టులను ఊస్ట్ చేసేందుకు సైతం తాను వెనుకాడబోనని హెచ్చరించినట్లు తెలుస్తోంది. జగన్ ధోరణి చూస్తుంటే త్వరలో ఏపీ కేబినెట్ మరోసారి పునర్వ్యవస్థీకరణకు అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. మంత్రి హోదా, అధికారం తప్ప బాధ్యత తమది కాదనుకునే వారిని మంత్రి పదవుల నుంచి తప్పించే యోచనలో ఉన్నారని సంకేతాలు వస్తున్నాయి.

కేసీఆర్ కేబినెట్‌లో ఆ చర్యలేవి?

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ఇప్పటికే ఓ సారి మంత్రివర్గంలో మార్పులు చేశారు. ఎమ్మెల్యేలకు ఇచ్చిన హామీ ప్రకారం తొలి కేబినెట్ మంత్రులకు రెండున్నరేళ్ల పదవీకాలం కల్పించారు. ఆ తర్వాత వారి పనితీరు, సీనియార్టీని బేస్ చేసుకుని కొంత మందిని కంటిన్యూ చేయగా మరి కొంత మందికి ఉద్వాసన పలికారు. మరోసారి మంత్రివర్గంలో మార్పులకు సిద్దం అవుతుండగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చర్చ మొదలైంది. ఇప్పటి వరకు మంత్రులపై అనేకమైన ఆరోపణలు వస్తున్నా సీఎం కేసీఆర్ కనీసం చర్యలు తీసుకోలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీపై విమర్శలు వస్తే ఒంటికాలితో విరుచుకుపడే టీఆర్ఎస్ మంత్రులు తమ శాఖలో ఆరోపణలు వస్తే మాత్రం కిమ్మనడం లేదనే టాక్ ఉంది. నేరుగా మంత్రులపైనే ఆరోపణలు వినిపిస్తున్నా సీఎం కనీసం విచారణకు ఆదేశించడం లేదని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. కొన్ని శాఖల్లో మంత్రులకు, అధికారులకు మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనపడుతోందని మరి కొంత మంది మంత్రులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయంలో కేసీఆర్ మాత్రం మౌనం వహిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. టీఆర్ఎస్ మొదటి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి ఈటల రాజేందర్ లను మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేసినా సరైన విచారణ జరగకుండానే చర్యలు తీసుకున్నారని అందులో కేవలం రాజకీయ కోణమే ఉందనే విమర్శలు ఉన్నాయి.

ప్రతిపక్షాలకు ఊతమిచ్చేలా కేసీఆర్ తీరు:

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది. మునుగోడులో ఉప ఎన్నికను అనివార్యం అయ్యేలా చేసి టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు సవాల్ చేస్తోంది బీజేపీ. ఈ నేపథ్యంలో మంత్రుల విషయంలో ఏపీ సీఎం జగన్ పనితీరుపై నివేదికలు తెప్పించుకుని చర్యలకు సిద్ధం అవుతుంటే కేసీఆర్ మాత్రం మంత్రుల పనితీరుపై ఎలాంటి కసరత్తు చేయడం లేదనే విమర్శలు ప్రతిపక్షాల నుండి వినిపిస్తున్నాయి. కేవలం రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో ఎవరికి సీట్లు ఇస్తామనే విషయంలో నివేదికలపై లీకులు ఇస్తున్నారే తప్ప పాలన వ్యవహారాల్లో ఏం జరుగుతోందనే సర్వేలు ఎందుకు జరపడం లేదు, ఆ విషయంలో నివేదికలు ఎందుకు తెప్పించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. హోం మంత్రి మనవడి పేరు ఓ కేసులో ప్రధానంగా వినిపించింది. విద్యార్థుల ఆందోళనలతో ఆ శాఖ అప్రతిష్టను మూటగట్టుకుంటోంది. ధరణిలో లోటుపాట్లతో రెవెన్యూ శాఖ, ధాన్యం కొనుగోలు వ్యవహారం, అధ్వానంగా తయారైన రోడ్లు, ఇబ్రహీంపట్నంలో కు.ని ఆపరేషన్లు వికటించి మహిళల మృత్యువాత, ఎక్సైజ్ పాలసీపై ఆరోపణలు ఇలా అన్ని శాఖలపై ఆరోపణలు నిత్య కృత్యం అయ్యాయి. ఇక ఎమ్మెల్యేలు, కింద స్థాయి ప్రజా ప్రతినిధుల ఆగడాలు విపరీతమం అవుతున్నాయనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి మాత్రం కనీసం స్పందించకపోగా, మంత్రులు, ఎమ్మెల్యేలు, సంబంధిత నేతలను పిలిచి కనీసం మందలించడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఓ వైపు సరిగా పని చేయని మంత్రును తప్పించేదుకు జగన్ ప్రయత్నం చేస్తుంటే అలాంటి ప్రయత్నాలు కేసీఆర్ చేయడం లేదనే విషయాన్ని ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకుపోయే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Also Read : ఉత్కంఠగా జాతీయ రాజకీయాలు.. ఒకే వేదికపైకి KCR, చంద్రబాబు


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed