మోడీ టార్గెట్‌గా త్వరలో విపక్షాల భారీ మీటింగ్.. కేసీఆర్, చంద్రబాబు హాజరు?

by Disha Web Desk 2 |
మోడీ టార్గెట్‌గా త్వరలో విపక్షాల భారీ మీటింగ్..  కేసీఆర్, చంద్రబాబు హాజరు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మోడీని గద్దె దించడమే టార్గెట్‌గా విపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. బీజేపీని ఎదుర్కొనే క్రమంలో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చే పనిని తన భుజాన వేసుకున్న బిహార్ సీఎం నితీష్ కుమార్ శనివారం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం జాతీయ స్థాయిలో విపక్షాల సమావేశం ఉంటుందని చెప్పారు. విపక్షాల ఐక్యతతో పాటు భవిష్యత్ కార్యచరణపై చర్చించేలా ఈ మీటింగ్ ఉండబోతోందని వెల్లడించారు. ఈ మీటింగ్ ఎక్కడ నిర్వహించాలనేది ఇంకా నిర్ణయిచనప్పటికీ పాట్నాలో నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయిస్తే అది సంతోషమే అన్నారు. ప్రస్తుతం వివిధ పార్టీల నేతలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజీగా ఉన్నారని అవి ముగిసిన తర్వాత తమ సమావేశం జరిగే స్థలాన్ని, తేదీని ఖరారు చేస్తామన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీల కూటమి ఏర్పాటుకు సంబంధించిన అంశంపై మేము కచ్చితంగా కలిసి చర్చిస్తామని ఈ సందర్భంగా నితీష్ కుమార్ చెప్పారు.

బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు విపక్ష పార్టీలను ఏక తాటి పైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న నితీష్ కుమార్, ఆర్జీడీ నేత తేజస్వీ యాదవ్ ఇటీవలే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, లక్నోలో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను కలిశారు. వీరితో కలిసిన కొద్ది రోజులకే నితీష్ కుమార్ విపక్షాల సభపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. అంతకు ముందు ఏప్రిల్ 12న నితీష్ కుమార్ తేజస్వీ యాదవ్‌లు ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను కూడా కలిశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. ఈ సందర్భంగా బీజేపీని ఓడించేందుకు దేశంలోని ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చాలా అవసరం అని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఉన్న కూటమితో కలిసి వచ్చేందుకు మమతా, అఖిలేష్ యాదవ్‌లు తొలుత నిరాకరించినా ప్రస్తుతం వారు హస్తం పార్టీతో కలిసి నడిచేందుకు ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

కేసీఆర్, చంద్రబాబు హాజరుపై సస్పెన్స్:

బీఆర్ఎస్ పేరుతో బీజేపీపై వార్ ప్రకటించిన కేసీఆర్ నితీష్ కుమార్ చెబుతున్న ప్రతిపక్షాల మీటింగ్‌కు హాజరుఅవుతారా లేదా అనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్‌తో సహా విపక్షాలన్ని ఏకమై బీజేపీని ఎదుర్కోవాలని ప్రయత్నిస్తున్న వేళ ఈ పోరాటానికి కేసీఆర్ మద్దతు తెలుపుతారా లేక దూరంగా ఉంటారా అనేది సందేహంగా మారింది. బీఆర్ఎస్ నేపథ్యంలో బీజేపీతో పాటు కాంగ్రెస్‌ను కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారు. ఈ రెండు పార్టీల వల్లే దేశం వెనుకబడిపోయిందని సందర్భం వచ్చిన ప్రతిసారీ దుయ్యబడుతున్నారు. ఇదిలా ఉంటే నిన్నా మొన్నటి వరకు బీజేపీపై కారాలు మిరియాలు నూరిన చంద్రబాబు ఇటీవల అనూహ్యంగా మోడీ విధానాలపై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి పరిస్థితుల్లో నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కలిగిన కూటమి మీటింగ్‌కు కేసీఆర్, చంద్రబాబు హాజరు అవుతారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.

Read more:

Breaking: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. తాజా పరిస్థితులపై చర్చ


Next Story