పదవి ఆమెది.. పెత్తనం ఆయనదే

by  |
పదవి ఆమెది.. పెత్తనం ఆయనదే
X

దిశ ప్రతినిధి, మెదక్: ఎన్నో ఏళ్ళు గా పోరాడి సాధించుకున్న రాజకీయ రిజర్వేషన్ ఫలాలు మహిళలకీ పూర్తి స్థాయిలో దక్కడం లేదు. రాజకీయ రంగంలోనూ మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు వర్తింపజేసి పాలనా వ్యవహారాల్లో భాగస్వాములను చేయాలనే ప్రయత్నం ఆచరణలో సాధ్యం కావడం లేదు. కొంత మంది భర్త చాటు భార్యలుగానే మిగిలిపోతున్నారు. ఒక్క విషయంలోనూ స్వతంత్రంగా వ్యవహరించడం లేదు. కొందరు తప్పనిసరైతే తప్ప ఇంటి గడప దాటడం లేదు.

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మహిళ వార్డు మెంబర్ మొదలు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, ఏఎంసీ, తదితర స్థానాల్లో 50 శాతం మహిళలు ఉన్నారు. అందులో 10 శాతం మహిళలు కూడా సొంత రాజకీయాలు చేయడం లేదు. సతుల స్థానంలో పతులు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. పార్టీ సమావేశాలకే కాదు, ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం వారే హాజరవుతున్నారు. కేవలం పాలకవర్గం సమావేశానికి తప్ప అంతటా భార్యకు బదులు భర్తలే అధికారం చెలాయిస్తున్నారు. చివరకు కొందరు అధికారిక కార్యక్రమాల్లోనూ దర్శనమిస్తున్న ఘటనలు అక్కడక్కడా దర్శనమిస్తున్నాయి.

ఇంటికే పరిమితం..

ఉమ్మడి మెదక్ జిల్లాలోని చాలా గ్రామాల్లో మహిళా ప్రజాప్రతినిధులకు బదులు వారి భర్తలు లేదా కొడుకులే హాజరవుతున్నారు. ఇంటి వద్దే కాదు వార్డులు, మున్సిపల్ కార్యాలయం, ఇతర ప్రభుత్వ ఆఫీసులు, పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో తామే ప్రజాప్రతినిధులం అనే రీతిలో కొనసాగుతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలంటే ప్రజాప్రతినిధి సంతకం తప్పనిసరి చేయడంతో కేవలం వారి చేత సంతకాలు పెట్టించి నిధులు డ్రా చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం భార్య వెంట ప్రచారంలో పాల్గొన్న భర్త ఇపుడు తమ సతులను ఇంటికే పరిమితం చేస్తూ అధికార దర్పం ప్రదర్శిస్తుండటన్ని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

కాగా, ఈ సారి గెలిచిన మహిళ ప్రజా ప్రతినిధుల్లో కొంతమంది ప్రొఫెసర్లు, ప్రభుత్వ టీచర్, లెక్చరర్, ఇతర ప్రయివేటు కంపెనీలో జాబ్ చేసి ప్రజా సేవ చేయాలని సంకల్పంతో తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి పోటీ చేసి గెలుపొందిన మహిళ ప్రజాప్రతినిధులు తమదైన శైలిలో రాణిస్తున్నారు. గ్రామ సభల్లో కూడా కొందరు మహిళా ప్రజాప్రతినిధులు అధికారుల తప్పులు ఎత్తి చూపుతూ ప్రజా సమస్యలు ప్రతిబింబించేలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా మహిళలకు కేటాయించిన స్థానాల్లో వారి భర్తలు, కుమారులు అధికారం చెలాయించడం సరిగా లేదని రాజకీయ విశ్లేషకులు , మహిళా సంఘాల సభ్యులు, మేధావులు అంటున్నారు.

Next Story