క్రిమినల్ పోలీస్.. ప్రియురాలి కోరిక తీర్చలేక దారుణ హత్య

by  |
క్రిమినల్ పోలీస్.. ప్రియురాలి కోరిక తీర్చలేక దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: అతనో బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి. ప్రజలు తప్పు చేయకుండా చూడాల్సిన వాడే తప్పు చేసి దొరికిపోయాడు. ఎంతోమందికి ఆదర్శంగా నిలవాల్సిన ఆ వ్యక్తే ఆదర్శాలను మరిచి వివాహేతర సంబంధాలకు అలవాటు పడ్డాడు. ఇక.. చివరికి ఆ వివాహేతర సంబంధమే అతని విచక్షణను మరిచేలా చేసింది. ప్రియురాలిని వివాహమాడాలంటే భార్యకు విడాకులు ఇవ్వాలి. విడాకులు కావాలంటే భార్యకు భరణం ఇవ్వాలి. భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తుందని, ప్రియురాలిని అతి కిరాతకంగా మట్టుబెట్టి, చివరికి పోలీసుల చేతికి చిక్కిన పోలీస్ అధికారి ఉదంతం గుజరాత్ లో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. అహ్మదాబాద్‌కు చెందిన అజయ్‌ దేశాయ్‌ పోలీసు అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి 2017లో వివాహమైంది. కొద్దీ రోజులు కాపురం ఎలాంటి అవకతవకలు లేకుండా నడిచింది. ఇక ఈ నేపథ్యంలోనే అతడికి స్వీటీ పాటిల్‌తో పరిచయం ఏర్పడింది. అనతి కాలంలోనే ఆ పరిచయం, ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటి నుంచి ఇద్దరు సహజీవనం చేయసాగారు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా స్వీటి ఒత్తిడి చేయడంతో ఏడాది క్రితం అజయ్‌ ఓ గుడిలో ఆమెను వివాహం చేసుకున్నాడు. కానీ, వివాహం చేసుకున్నా చట్టబద్ధంగా భార్యకు విడాకులు ఇచ్చి, తనతో ఉండాలని స్వీటీ పోరు పెట్టడం మొదలుపెట్టింది. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు తలెత్తాయి.

స్వీటీ కోరినట్లు భార్యకు విడాకులు ఇస్తే.. భరణంగా ఆమెకు 25 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. అంత డబ్బు ఇవ్వడం ఇష్టం లేని అజయ్‌.. స్వీటిని అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఈ నేపథ్యంలోనే జూన్ 4 న స్వీటీ మరోసారి అజయ్ తో విడాకులు గురించి గొడవపెట్టుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన అజయ్, ప్రియురాలిని గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని తన స్నేహితుడు కిరిట్సింగ్ జడేజాకి చెందిన హోటల్‌ ప్రాంగణంలో పూడ్చిపెట్టాడు. జూన్ 5వ తేదీన ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి అజయ్ ని పట్టుకున్నారు. తమతో ఉండే పోలీస్ అధికారే ఈ దారుణానికి ఒడిగట్టాడన్న విషయం తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని అజయ్ ని అరెస్ట్ చేశారు.


Next Story

Most Viewed