సర్వెంట్‌గా చేరి.. రూ.35 లక్షలు చోరీ

by  |
సర్వెంట్‌గా చేరి.. రూ.35 లక్షలు చోరీ
X

దిశ, క్రైమ్ బ్యూరో: నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని కేక్ కట్ చేసేందుకు కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు ఏర్పాట్లు చేస్తుండగా.. సమీపంలోని ఓ అపార్మెంట్‌లో భారీ దొంగతనం జరిగినట్టుగా పోలీసులు సమాచారం అందుకున్నారు. తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించి తెల్లవారేలోగా నిందితున్ని పట్టుకున్నారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనపై శనివారం బషీర్ బాగ్ కార్యాలయంలో సీపీ అంజనీకుమార్ వివరాలను వెల్లడించారు.

అయితే, బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్కు సమీపంలోని గోకుల్‌ధామ్ అపార్ట్మెంట్‌లో డాక్టర్ విజయ్ సీతారామ్ కుటుంబంతో పాటు నివాసం ఉంటున్నాడు. సీతారామ్ అనారోగ్యంతో ఉండటంతో అతన్ని చూసుకునేందుకు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నందగోపాల్‌ను పనిలో పెట్టుకున్నారు. కాగా, కొన్ని రోజుల పాటు నమ్మకంగా పనిచేసిన నందగోపాల్, ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు తయారు చేసే వ్యక్తిని పిలిపించుకున్నాడు. డాక్టర్ సీతారామ్ ఇంట్లోని అల్మారాకు డూప్లికేటు తాళాలు తయారు చేయించుకున్నాడు. అనంతరం పరిస్థితి సీతారామ్ ఆస్పత్రిలో చేరడంతో ఇదే అదునుగా భావించి, గత శుక్రవారం ఇంట్లోని 65 తులాల బంగారం, 55 తులాల వెండి, రూ.1.20 లక్షల నగదును దొంగిలించాడు. అదే రోజు డిశ్చార్జి అయి ఇంటికొచ్చిన సీతారామ్ కు దొంగతనం జరిగినట్టుగా గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు సేకరించి పోలీసులు నిందితుడు నందగోపాల్‌ను అరెస్ట్ చేశారు. రాత్రి జరిగిన దొంగతనాన్ని తెల్లవారేలోగా చేధించిన పోలీసులను సీపీ అంజనీకుమార్ అభినందించారు.

Next Story