బిట్టూ.. గట్టు హత్య గుట్టు విప్పు

by  |
బిట్టూ.. గట్టు హత్య గుట్టు విప్పు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: లొగుట్టు పెరుమాళ్లకెరుక అన్నట్టుగా మారింది వామన్ రావు, నాగమణిల హత్య కేసులో విచారణ తీరు. అనూహ్యంగా తెరపైకి బిట్టు శ్రీను రావడంతో కేసు కొత్త మలుపు తిరిగినట్టయింది. కుంట శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్న తరువాత తనకు వేట కొడవళ్లు బిట్టు శ్రీను ఇచ్చాడని తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన మంథనిలోని ఫ్రూట్స్ షాప్ సమీపంలోని సీసీ ఫుటేజ్‌ను సేకరించారు. దీంతో బిట్టు కుంట శ్రీనుకు కత్తులు ఇస్తున్నట్టుగా రికార్టు కావడంతో కేసులో బిట్టు శ్రీను ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు. 19న బిట్టు శ్రీనును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని అన్ని కోణాల్లో విచారించడం ఆరంభించారు. అదే రోజున కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్‌ను కోర్టులో హాజరు పర్చిన పోలీసులు శనివారం నుండి బిట్టు శ్రీనుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏడుగురు పోలీస్​అధికారులు బిట్టు శ్రీనును ప్రశ్నిస్తున్నా ఆయన మాత్రం స్పందించడం లేదని తెలుస్తోంది. హత్య కోసం కత్తులు, కారు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎవరు ఇవ్వమంటే ఇచ్చావు? అనే ప్రశ్నకు తానే స్వయంగా ఇచ్చానని, తనకు ఎవరూ చెప్ప లేదన్న సమాధానం మినహా మరేమీ రావడంలేదని సమాచారం. దీంతో బిట్టు నుండి సమాచారం రాబట్టడం ఎలా అనే విషయంపై పోలీస్​ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

సంకట స్థితిలో పోలీసులు

కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా తయారైంది రామగుండం పోలీసుల పరిస్థితి. వామన్ రావు హత్య కేసు జరిగినప్పటి నుండి ప్రతిపక్ష పార్టీలు, అడ్వకేట్లు ఈ హత్య వెనక ఉన్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ సంఘటనపై ఉన్నతాధికారులు కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను పేరు తెరపైకి రావడంతో ఆయన వెనకున్నదెవరోనన్న విషయంపై స్పష్టత ఇవ్వకపోతే ప్రతి ఒక్కరూ తమను నిందిస్తారన్న ఆందోళన పోలీసుల్లో నెలకొంది. మరో వైపు హై కోర్టు కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించి డీజీపీకి, ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం, కేసు సీబీఐకి బదలాయించాలన్న పిటిషన్ దాఖలు కావడం కూడా పోలీసులను దిగమింగుకోలేని పరిస్థితికి చేర్చింది. సుమోటోగా హై కోర్టు కేసును విచారించినట్టయితే ఎలాంటి పరిస్థితి ఉంటుందోనని, తామేమైనా ఇరుక్కపోయే ప్రమాదం ఉంటుందేమోననే ఆందోళన వారిలో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.

ఆ పోలీస్​అధికారి ఎవరో?

గట్టు వామన్ రావు, నాగమణిల మృతదేహాలను పెద్దపల్లి ఆస్పత్రిలో పోస్టు మార్టం కోసం ఉంచినప్పుడు అతని తండ్రి కిషన్ రావు చెప్పినట్టుగా జరుగుతున్న ఈ ప్రచారం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. ఈ హత్యకు ముందు ఒక పోలీస్​అధికారి గుంజపడుగు గ్రామ పరిసరాలను పరిశీలించి వెళ్లిపోయాడని వ్యాఖ్యానించినట్టుగా టాక్ నడుస్తోంది. ఈ వ్యవహారం వెనక ఉన్న పోలీస్​ అధికారి ఎవరు అనే విషయం తేలిస్తే కేసు విచారణ మరింత సులువు అవుతుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కేసు విషయంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు దర్యాప్తు అసంపూర్తిగా జరిగిందని భావిస్తే నిందితులకు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదని పలువురు అంటున్నారు.

Next Story

Most Viewed