భారీ వర్షాల ఎఫెక్ట్.. పోలీసులు చేసిన పనికి నెటిజన్లు ఫిదా..

by  |
భారీ వర్షాల ఎఫెక్ట్.. పోలీసులు చేసిన పనికి నెటిజన్లు ఫిదా..
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో గులాబ్ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు పల్లెలు, పట్టణాలు వణుకుతున్నాయి. ఎక్కడికక్కడ వరదలు వచ్చి బయటకు వెళ్లలేని స్థితిలో నెలకొంది. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ మహానగరం గత రెండు రోజులుగా అతలాకుతలమైంది. అయితే.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో వర్షపు నీరు వెళ్లలేక పూర్తిగా రోడ్లపైనే నిలిచిపోయాయి. నీరు వెళ్లిపోయేలా.. జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మ్యాన్‌హోల్స్ మూతలను తొలగించి వివిధ చర్యలు తీసుకుంటున్నారు.

అయితే.. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మ్యాన్‌హోల్ మూతలను సగం వరకూ తీసి వదిలేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని చోట్ల డ్రైనేజీ మరమ్మత్తులు చేస్తుండటంతో అటువైపుగా వెళ్లే ప్రజలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మణికొండ ప్రాంతంలో ఓ యువకుడు గల్లంతై శవమై తేలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. నీరు నిల్వ ఉన్న చోట ప్రజలను అప్రమత్తం చేస్తూ.. బల్దియా సహకారంతో నీటిని తొలగిస్తున్నారు.

అంతేకాకుండా.. మ్యాన్‌హోల్ ఉన్న చోట కర్రకి జెండా ఏర్పాటుచేసి ప్రమాదమని ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు చేస్తున్న పనికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలను పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెటిజన్లు సెల్యూట్ అంటూ రీట్వీట్లు, కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed