పంజాబ్ నేషనల్ బ్యాంకు సర్వర్‌లో లోపాలు!

by  |
PNB
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) సర్వర్‌లో సుమారు 18 కోట్ల ఖాతాదారుల వ్యక్తిగత, ఆర్థిక వివరాలు బహిర్గతం అయ్యాయని సైబర్ సెక్యూరిటీ సంస్థ సైబర్ఎక్స్9 వెల్లడించింది. దాదాపు 7 నెలల పాటు ఖాతదారుల వివరాలు బహిర్గతమైనట్టు సైబర్ఎక్స్9 పేర్కొంది. బ్యాంకుకు చెందిన డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని యాక్సెస్ చేసే అవకాశం లభించిందని కన్సల్టెన్సీ సంస్థ తెలిపింది. అయితే, దీనిపై స్పందించిన పీఎన్‌బీ.. సర్వర్‌లో సాంకేతిక సమస్య ఉన్నమాట నిజమే, అయినప్పటికీ ఖాతాదారులకు సంబంధించిన ఎటువంటి సమాచారం బయటకు వెళ్లలేదని స్పష్టం చేసింది. ముందు జాగ్రత్త చర్యగా సర్వర్‌ను షట్‌డౌన్ చేసినట్టు బ్యాంకు వెల్లడించింది.

‘పీఎన్‌బీ బ్యాంకులోని 18 కోట్ల ఖాతాదారుల వివరాలు గడిచిన ఏడు నెలలుగా బహిర్గతంగానే ఉంది. తాము చెప్పిన తర్వాత బ్యాంకు జాగ్రత్త పడిందని, దీని గురించి సీఈఆర్‌టీ-ఇన్, ఎన్‌సీఐఐపీసీకి చెప్పామని’ సైబర్ఎక్స్9 వ్యవస్థాపకుడు, ఎండీ హిమాన్షు పాఠక్ చెప్పారు. సైబర్ దాడులకు అవకాశం కల్పించే స్థాయిలో పీఎన్‌బీ లోపం ఉందన్నారు. ‘సర్వర్‌లో లోపం ఉన్న మాట వాస్తవమేనని, ఆఫీస్ 365 క్లౌడ్‌లోకి ఈ-మెయిల్స్‌ను రూటింగ్ చేసేందుకు ఆ సర్వర్‌ను వినియోగిస్తున్నాం. ఇందులో ఖాతాదారులకు సంబంధించిన సున్నితమైన డేటా ఏమీ లేదని’ పీఎన్‌బీ బ్యాంకు వివరించింది.


Next Story