నేడు నూతన పార్లమెంట్ భవన శంకుస్థాపన

by  |
నేడు నూతన పార్లమెంట్ భవన శంకుస్థాపన
X

న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ భవనానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు (గురువారం) శంకుస్థాపన చేయనున్నారు. భూమి పూజనూ చేయనున్నారు. నూతన పార్లమెంట్ భవన నిర్మాణ ప్రతిపాదనలను తొలిసారిగా రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా గతేడాది ఆగస్టు 5న ఏకకాలంలో చేశారు. 971 కోట్ల వ్యయ అంచనాతో 64.5చదరపు మీటర్ల వైశాల్యంలో నాలుగు అంతస్తుల కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు.

త్రిభుజాకారంలో నిర్మించ తలపెట్టిన ఈ భవన నిర్మాణ పనులను 75వ స్వాతంత్ర్య దినోత్సవంలోపు పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఆధునిక ఆడియో, వీడియో కమ్యూనికేషన్ సదుపాయాలు, డేటా నెట్‌వర్క్ వ్యవస్థలతో సాంకేతిక హంగులతో కొత్త పార్లమెంట్ భవనం రూపుదిద్దుకోనుంది. భారత సంస్కృతిని ప్రతిబింబించే శిల్పాలను మలచడానికి దేశవ్యాప్తంగా నైపుణ్యవంతులైన శిల్పులను ఆహ్వానించనున్నారు. నూతన భవనంలో లోక్‌సభలో 888 మంది సభ్యులు కూర్చునే వీలుండనుంది.

అవసరమైతే ఈ సంఖ్యను 1224కు పెంచే అవకాశముంది. 384 సీట్ల సామర్థ్యంతో రాజ్యసభ చాంబర్‌ను నిర్మించనున్నారు. రూ. 83లక్షలతో నిర్మితమైన ప్రస్తుత పార్లమెంట్ భవనానికి 1921 ఫిబ్రవరి 12న డ్యూక్ ఆఫ్ కన్నాట్ శంకుస్థాపన చేశారు. ఆరేండ్ల తర్వాత పూర్తయిన ఈ భవనాన్ని 1927 జనవరి 18న అప్పటి భారత వైశ్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. తర్వాతి రోజే(జనవరి 19న) తొలిసారిగా సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సమావేశమైంది.


Next Story

Most Viewed