'టోక్యో వెళ్లే అథ్లెట్లకు వ్యాక్సిన్ అందించండి'

by  |
టోక్యో వెళ్లే అథ్లెట్లకు వ్యాక్సిన్ అందించండి
X

దిశ, స్పోర్ట్స్ : టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి ఇండియా తరపున వెళ్తున్న భారత అథ్లెట్లకు, సిబ్బంది అందరికీ తక్షణమే వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభించాలని ప్రధాని మోడీ ఆదేశించినట్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఒలింపిక్స్ సన్నాహాకాలు ఎలా జరుగుతున్నాయనే అంశంపై ప్రధాని మోడీ ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు మంత్రి రిజిజు చెప్పారు. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి మరో 50 రోజులు మాత్రమే ఉండటంతో ప్రధాని మోడీ సమీక్ష ప్రాధాన్యతను సంతరించుకున్నది. ‘క్రీడలు మన దేశ సంస్కారానికి గుండె వంటివి. మన యువత క్రీడా సంస్కృతిని మరింత బలంగా తయారు చేస్తున్నారు. టోక్యో వెళ్లనున్న ప్రతీ అథ్లెట్‌తో జులై నెలలో ఆల్‌లైన్ వేదిక ద్వారా పలకరిస్తాను. వారికి కావల్సిన స్పూర్తిని నింపడానికి నా వంతు కృషి చేస్తాను.

అలాగే దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరు మన అథ్లెట్లను ఎంకరేజ్ చేయాలి’ అని మోడీ చెప్పినట్లు మంత్రి రిజిజు వెల్లడించారు. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు 11 క్రీడల విభాగాల్లో 100 మంది అర్హత సాధించారు. మరో పాతిక మంది అర్హత కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే 26 మంది పారా అథ్లెట్లు అర్హత సాధించగా.. మరో 16 మంది అర్హత సాధించే అవకాశం ఉన్నట్లు క్రీడా మంత్రి రిజిజు చెప్పారు. టోక్యో ఒలింపిక్ క్రీడాకారులు కొవిడ్ బయోబబుల్ నిబంధనల వల్ల ఇళ్లకు దూరంగా గడపాల్సి వస్తున్నది. కాబట్టి వారిని రెగ్యులర్‌గా కుటుంబాలతో కలిసేలా వీడియో కాన్ఫరెన్స్‌లు ఏర్పాటు చేయాలని క్రీడా శాఖ నిర్ణయించినట్లు తెలిపారు. దీని వల్ల అథ్లెట్ల మానసిక ఆందోళన తగ్గుతుందని ఆయన చెప్పారు.



Next Story

Most Viewed