పీఎల్ఐ ద్వారా ఐదేళ్లలో రూ. 40 లక్షల కోట్ల ఆదాయం

by  |
పీఎల్ఐ ద్వారా ఐదేళ్లలో రూ. 40 లక్షల కోట్ల ఆదాయం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో స్థానిక తయారీని ప్రోత్సహించడానికి కేంద్రం ఇటీవల ‘ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకంలో భాగంగా పలు రంగాలకు రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. ఈ నిర్ణయం వల్ల దేశీయంగా తయారీ రంగంలో ఆదాయం భారీగా పెరిగే అవకాశాలున్నాయని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. దేశీయంగా దాదాపు 14 రంగాల్లో రాబోయే ఐదేళ్లకు రూ.35-40 లక్షల కోట్ల అదనపు ఆదాయం పొందగలవని క్రిసిల్ అభిప్రాయపడింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో చైనా నుంచి బయటికి వస్తున్న పెట్టుబడిదారులను ఆకర్షించే లక్ష్యంతో కేంద్రం ప్రత్యేకంగా పీఎల్ఐ పథకాన్ని తీసుకొచ్చింది. పలు రంగాల్లో సుమారు రూ.1.8 లక్షల కోట్ల విలువైన రాయితీలను, ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఈ పథకం ద్వారా రానున్న 24-30 నెలల కాలంలో ఉత్పత్తి ప్రారంభం అవనుంది. దీని మూలధన వ్యయం దాదాపు రూ. 2-2.7 లక్షల కోట్లకు పెరుగుతుందనే అంచనాలున్నాయి.

క్రిసిల్ విశ్లేషణ ప్రకారం.. స్థానికంగా బలహీన తయారీని కలిగిన మొబైల్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, టెలికాం పరికరాలు, ఐటీ హార్డ్‌వేర్ రంగాల్లో ఈ పథకం ద్వారా మూలధన వ్యయం 3.5 రెట్లు పెరుగుతుందని తేలింది. ‘2021-22 ఆర్థిక సంవత్సరంలో పీఎల్ఐ పథకం ఆర్థికవ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర వహించనుందని’ క్రిసిల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశు సుయాష్ చెప్పారు. అంతేకాకుండా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 35 శాతం మేర కుదేలైన పారిశ్రామిక పెట్టుబడులు 2021-22లో 45-50 శాతం పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత 2025 నాటికి 7 శాతంతో స్థిరంగా ఉంటుందని పేర్కొన్నారు.



Next Story