యాసంగికి ఆ పంట వద్దు – ప్రత్యామ్నాయ పంటలే ముద్దు: జిల్లా కలెక్టర్

by  |
యాసంగికి ఆ పంట వద్దు – ప్రత్యామ్నాయ పంటలే ముద్దు: జిల్లా కలెక్టర్
X

దిశ, మెదక్: జిల్లాలో రైతులు యాసంగిలో వరి వేయొద్దని, ప్రత్యమ్నాయ పంటలు పండించేలా రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. సోమవారం కంది క్లస్టర్ రైతు వేదికలో యాసంగి సీజన్ 2021-22 పై సంగారెడ్డి, పటాన్ చెరువు క్లస్టర్ ల వ్యవసాయ శాఖ, ఏడిలు, ఏఈఓ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భారత ఆహార సంస్థ(FCI) వరిని కొనడం లేదని రైతులకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. రైతులు ఎవరు నష్టపోవద్దన్నారు. యాసంగిలో వరి కొనుగోళ్ళు ఉండవు. జిల్లాలో రైతులు యాసంగి సీజన్ లో వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు.

శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసర, కంది, మినుము తదితర ఆరుతడి పంటల వైపు మళ్ళించాలన్నారు. భూముల లక్షణాలకు అనుగుణంగా ఏ పంటలు వేయాలో రైతులకు సూచించాలని తెలిపారు. ప్రత్యమ్నాయ పంటల విత్తనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు ఈ నెల 27 నుండి 29 వరకు ప్రతి రైతు వేదికలో రైతులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో గల 116 రైతు వేదికలకు 116 మంది వ్యవసాయేతర అధికారులను ప్రత్యేకించి నియమించాలని వ్యవసాయ శాఖ జె.డి కి సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు, ఉద్యాన శాఖ అధికారి సునీత, సీడ్స్ కార్పొరేషన్ ప్రతినిధి, వ్యవసాయ శాస్త్రవేత్త లు ,మండల ఎ.ఓ లు, ఏ ఈ ఓ లు,తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed