మొక్కల్ని చంపేందుకు పురుగుల్ని వదిలారు!

by  |
మొక్కల్ని చంపేందుకు పురుగుల్ని వదిలారు!
X

దిశ, వెబ్‌డెస్క్: మొక్కలు పెంచండి అని చెప్తుంటారు కానీ, మొక్కలను చంపేందుకు పురుగులను వదలడమేంటని ఆశ్చర్యపోకండి. ఇక్కడ మొక్కలంటే కలుపు మొక్కలు. మళ్లీ కలుపు మొక్కలు అనగానే ఏదైనా పొలంలోనో, చేనులోనో అనుకోవద్దు. ఇక్కడ ఆమ్‌స్టర్‌డామ్ దేశం మొత్తం వ్యాపించి ఇబ్బంది పెడుతున్న కలుపు మొక్కలను నాశనం చేయడానికి పురుగుల్ని వదిలారు. సాధారణంగా ఆయా దేశాలకు పరిమితమైన కొన్ని మొక్కల జాతులు ఉంటాయి. ఆ వాతావరణాలకు అనుగుణంగా వాటి పెరుగుదల, వినాశనం ఉంటాయి. అలా కాకుండా కొన్ని మొక్కల జాతులు వేరే దేశాల వాతావరణ పరిస్థితుల్లో విపరీతంగా పెరిగి, స్థానిక జీవావరణాన్ని నాశనం చేస్తాయి. ఇలాంటి మొక్కల జాతులను అన్యదేశ జాతులు లేదా దాడి చేసే విదేశీ జాతులు అంటారు. ఇప్పుడు ఇలాంటి ఒక అన్యదేశ జాతి మొక్క వల్లనే ఆమ్‌స్టర్‌డామ్‌లో వరదలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. వరదలు మాత్రమే కాకుండా తాగునీటి నాణ్యతను కూడా ఈ అన్యదేశ జాతి మొక్కలు దెబ్బతీస్తున్నాయి. అందుకే వాటిని కట్టడి చేయడానికి డచ్ ప్రభుత్వం పురుగులను వదలాలని నిర్ణయించుకుంది.

జపనీస్ నాట్‌వీడ్ అని పిలిచే ఈ కలుపు మొక్కకు కాంక్రీటు నుంచి చొచ్చుకుపోయి ఎదిగే శక్తి ఉంటుంది. దీనివల్ల పెద్ద పెద్ద బిల్డింగ్‌ల పునాదులు దెబ్బతిని వాటిలో నీరు చేరుతున్నాయి. అలాగే నీటి ప్రవాహాన్ని అడ్డుకునే శక్తి గల ఈ మొక్కల కారణంగా నీటి నిల్వలు పెరిగి వరదలు కూడా వచ్చే పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ మొక్కను అంతం చేయడానికి జపనీస్ నాట్‌వీడ్ సైలిడ్స్ అనే పురుగులను ఆమ్‌స్టర్‌డామ్‌లో వదిలారు. మొదటి విడతగా 5000 పురుగులను మూడు ప్రదేశాల్లో వదిలిపెట్టినట్లు అధికారులు తెలిపారు. నాట్‌వీడ్ మొక్కలు యువదశలో ఉన్నపుడే ఈ పురుగులు దాడి చేసి దాన్ని నాశనం చేయగలుగుతాయి. మొత్తం మూడు విడతల్లో పురుగులను వదిలి ఈ అన్యదేశ జాతి మొక్క తీవ్రత స్థాయిని తగ్గిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఏదేమైనా కొన్ని మొక్కలు పెంచినా కష్టమేనని ఈ నాట్‌వీడ్ పరిస్థితిని చూస్తే తెలుస్తోంది.

Next Story

Most Viewed