ప్రమోటర్ల ఒత్తిడికి తలొగ్గిన స్టార్ గ్రూప్

by  |
ప్రమోటర్ల ఒత్తిడికి తలొగ్గిన స్టార్ గ్రూప్
X

దిశ, స్పోర్ట్స్ : ఫుట్‌బాల్, క్రికెట్‌లో ప్రొఫెషనల్ లీగ్స్ అమితమైన ఆదరణ పొందడంతో అదే బాటలో ఇండియాలో పలు క్రీడల్లో లీగ్స్ ప్రారంభమయ్యాయి. ఫుట్‌బాల్‌లో ఇండియన్ సూపర్ లీగ్, బ్యాడ్మింటన్‌లో ప్రీమియర్ బ్యాడ్మింటన్‌ లీగ్‌లతో పాటు ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) కూడా ప్రారంభమైంది. ఇండియాలో పీకేఎల్ అత్యంత ఆదరణ పొందింది. గ్రామీణ ప్రాంతంలో కూడా సుపరిచితమైన ఈ ఆటను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించడంతో ఐపీఎల్‌కు ధీటుగా పీకేఎల్ అవతరించింది. మార్షల్ స్పోర్ట్స్ అనే సంస్థ ఇండియాలో పీకేఎల్‌ను ప్రారంభించింది. ఈ పీకేఎల్‌లో ఎంతో మంది సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు ఫ్రాంచైజీలు ఉన్నారు. ఆటగాళ్ల వేలం కూడా భారీగా జరిగింది. అయితే మార్షల్ స్పోర్ట్స్ అనేది స్టార్ ఇండియాకు చెందిన సంస్థే. ఇందులో 74 శాతం వాటా స్టార్ ఇండియాదే కావడంతో పీకేఎల్ బ్రాడ్‌కాస్ట్ హక్కులన్నీ దాని వద్దే అట్టిపెట్టుకుంది.

ఫ్రాంచైజీల ఒత్తిడి..

పీకేఎల్‌లోని ఫ్రాంచైజీలకు స్పాన్సర్ల ద్వారానే కాకుండా బ్రాడ్‌కాస్ట్ హక్కుల ఆదాయాన్ని కూడా పంచాల్సి ఉంది. అయితే స్వయంగా స్టార్ గ్రూపే బ్రాడ్‌కాస్టర్ కావడంతో దానిపై ఆశించినంత ఆదాయం రావడం లేదు. దీంతో బ్రాడ్‌కాస్ట్ హక్కుల కోసం టెండర్లు పిలవాలని ఫ్రాంచైజీల నుంచి ఒత్తిడి మొదలైంది. స్టార్ ఇండియా వద్దే హక్కులు ఉంచుకోవడం కాంఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కిందకు వస్తుందని ఫ్రాంచైజీలు ఆరోపించాయి. దీంతో స్టార్ ఇండియా దిగిరాక తప్పలేదు. పీకేఎల్ 8వ సీజన్ నుంచి 12 వరకు (2025 వరకు) బ్రాడ్‌కాస్ట్ హక్కుల కోసం టెండర్లు పిలవాలని మార్షల్ స్పోర్ట్స్ నిర్ణయించింది. ఏప్రిల్ 8 నుంచి ఆన్‌లైన్ పద్దతిలో మీడియా హక్కుల కోసం టెండర్లు పిలవనున్నారు. ఈ మీడియా హక్కులను నాలుగు ప్యాకేజీలుగా మార్చారు. టెలివిజన్, డిజిటల్, గేమింగ్ హక్కుల కోసం.. లేదా మూడింటికి కలిపి టెండర్లు వేయవచ్చు. మూడింటినీ దక్కించుకునే సంస్థ గేమింగ్ లైసెన్సును సబ్ -లీజ్‌కు ఇచ్చే అవకాశం కూడా కల్పించారు. దీంతో హక్కుల కోసం పోటీ తీవ్రంగానే ఉంటుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

కబడ్డీని నిలబెట్టిన స్టార్ గ్రూప్..

ఎన్నో ఏళ్ల నుంచి ప్రపంచ వేదికల్లో ఇండియా కబడ్డీ జట్టు విశేషంగా రాణిస్తున్నది. ఎన్నోసార్లు ప్రపంచకప్ గెలిచినా ఏనాడూ తగిన గుర్తింపు రాలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే నగదు పురస్కారం కూడా తక్కువే. అయితే స్టార్ ఇండియా ఎప్పుడైతే ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభించిందో.. అప్పటి నుంచి ఆ ఆటకు పూర్వవైభవం వచ్చింది. క్రికెటర్లకు ధీటుగా కబడ్డీ ప్లేయర్లకు కూడా గుర్తింపు లభించింది. వేలంలో ఆటగాళ్లకు చెల్లించే డబ్బు కూడా పెరగడంతో చాలా మంది కబడ్డీ వైపు ఆసక్తి కనపరిచారు. అభిషేక్ బచ్చన్, మంచు విష్ణ వంటి స్టార్లు ఫ్రాంచైజీలను కొనుగోలు చేయడంతో పీకేఎల్‌కు మరింత పేరు వచ్చింది. అయితే తాము ప్రారంభించిన లీగ్ హక్కులు తమ వద్దే ఉండాలని స్టార్ భావించడంతో ఇన్నాళ్లూ దానికి పోటీ లేకుండా పోయింది. ఇప్పుడు ఫ్రాంచైజీల డిమాండ్‌తో తొలి సారి పీకేఎల్ హక్కులను వేలం వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇది లీగ్ మనుగడకు మంచిదేనని క్రీడా పండితులు అంటున్నారు. మరోవైపు కరోనా కారణంగా వాయిదా పడిన సీజన్-8 ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.


Next Story