లోటస్‌పాండ్‌కు పీకే టీమ్ మెంబర్ ప్రియ

by  |
PK Priya
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రశాంత్ కిషోర్ టీమ్ సభ్యురాలు ప్రియ, మరో ఇద్దరు బుధవారం లోటస్‌పాండ్ చేరుకున్నారు. షర్మిల పెట్టబోతున్న పార్టీ భవిష్యత్తు కార్యాచరణకు అందించాల్సిన సహకారంపై సోషల్ మీడియా సెల్ నిర్వాహకులతో ఈ బృందం చర్చలు జరిపింది. దాదాపు గంట పాటు జరిగిన ఈ చర్చ సందర్భంగా పార్టీని లాంఛనంగా గురువారం ప్రారంభిస్తున్నది మొదలు రెండున్నరేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు వివిధ అంశాలను వీరు చర్చించుకున్నట్లు తెలిసింది. తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితి, ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత, ప్రతిపక్ష పార్టీల బలాలు-బలహీనతలు, ప్రజల్లో ఏ పార్టీ పట్ల ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, ప్రభుత్వం నుంచి వారు ఏం కోరుకుంటున్నారు, ప్రత్యామ్నాయంగా షర్మిల పార్టీ ఎలాంటి పాత్ర పోషించాలి.. తదితర అనేక అంశాలను ప్రాథమిక స్థాయిలో వీరు చర్చించుకున్నట్లు తెలిసింది.

ప్రశాంత్ కిషోర్ ఒక రోజంతా లోటస్‌పాండ్‌లో తన టీమ్ సభ్యులతో చర్చించి వెళ్ళిపోయిన తర్వాత ఈ మీటింగ్ జరగడం విశేషం. ఇకపై ఏ పార్టీకీ వ్యూహకర్తగా వ్యవహరించబోనని స్పష్టంగా చెప్పిన పీకే తన టీమ్ సభ్యుల ద్వారా షర్మిల పార్టీకి సహకారం అందించాలనుకుంటున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ప్రియను టీమ్ లీడర్‌గా ఫస్ట్ ఫేజ్‌లో పంపి ఆ తర్వాత పరిస్థితులను బట్టి కీలకమైన సమయంలో మరికొన్ని టీమ్‌లను పంపే అవకాశం ఉన్నట్లు షర్మిల పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటివరకు అధికారికంగా షర్మిల పార్టీకి పీకే టీమ్ పరోక్షంగా సాయం అందించడంపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. కానీ గుట్టుచప్పుడు కాకుండా చర్చలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

Next Story

Most Viewed