ప్రేయర్ To పాలిటిక్స్.. సౌత్ ఇండియా పీపుల్ డిఫరెంట్ అప్రోచ్

by  |
Pew survey
X

దిశ, ఫీచర్స్ : భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. 29 రాష్ట్రాలు, 135 కోట్లకు పైగా జనాభా గల దేశంలో వేష భాషలు, సంస్కృతీ సంప్రదాయాల నుంచి ఆహారపు అలవాట్ల వరకు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో తేడా ఉన్నా.. సమైక్యతా రాగాన్ని వినిపిస్తూ అఖండ భారత్‌గా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. నిజానికి ప్రపంచ దేశాల్లోనూ ఇంతటి వైవిధ్యమున్న నేషన్ మరేదీ లేదని చెప్పొచ్చు. ఈ తేడా స్పష్టంగా తెలియాలంటే ఉత్తర, దక్షిణ భారతదేశాల ప్రస్తావన తేవాల్సిందే.

ఎందుకంటే నార్త్ ఇండియా మోడ్రన్ కల్చర్‌‌ను రిప్రజెంట్ చేస్తే.. సౌత్ ఇండియా ట్రెడిషనల్ ఇంపాక్ట్‌నిస్తుంది. ఈ క్రమంలోనే భారతీయులంతా తమ తమ మత విశ్వాసాలను స్వేచ్ఛగా పాటిస్తున్నామని చెప్పినట్టు ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ సర్వే వెల్లడించింది. 17 భాషలకు చెందిన దాదాపు 30 వేల నివాసితులతో 2019 చివర నుంచి 2020 ప్రారంభం అంటే కొవిడ్-19 పాండమిక్ మొదలయ్యే ముందు వరకు ఈ సర్వే చేపట్టగా.. మతం, రాజకీయాలు, గుర్తింపునకు సంబంధించి దేశంలోని మిగతావారితో పోలిస్తే సౌత్ ఇండియన్స్ భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నట్టు గుర్తించింది.

దేశంలోని ఇతర ప్రాంతాల‌కంటే దక్షిణాదిన అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి చెందిన ప్రజలు మతపరంగా తక్కువ ఆసక్తిని కలిగి ఉన్నారు. వీరిలో 69 శాతం మంది తమ జీవితాల్లో మతం చాలా ఇంపార్టెంట్ అని చెబుతుండగా.. దేశంలోని సెంట్రల్ పార్ట్‌కు చెందినవారు 92 శాతంగా ఉన్నారు. అంతేకాదు మతం లేదా కులం ఆధారంగా దక్షిణాది ప్రజలు వేరుచేయబడరని తెలిపిన సర్వే.. తమ ఫ్రెండ్‌షిప్ సర్కిల్స్, ఇరుగుపొరుగు వారిలో ఇతర మతస్తులు ఉండటంతో పాటు మతాంతర వివాహాలపై అభిప్రాయాలను వెల్లడించింది.

మతం..

దక్షిణ భారతదేశంలో సగానికంటే తక్కువమంది ప్రజలు(37%) మాత్రమే ప్రతీరోజు ప్రార్థన చేస్తారని సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా చూసుకుంటే మతానికి పెద్దగా ప్రాధాన్యమివ్వని హిందు, ముస్లిం, క్రైస్తవులు దక్షిణాదిలోనే ఉండగా, ప్రధానంగా హిందువుల్లోనే దేవున్ని పూజించే నిష్పత్తి తక్కువగా ఉంది. దక్షిణాదిన పదిమందిలో ముగ్గురు హిందువులు(30%) మాత్రమే ప్రతీరోజు దేవున్ని పూజిస్తున్నారని.. దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఆ సంఖ్య మూడింట రెండు వంతులు(68%) ఉందని సర్వే పేర్కొంది. 76% మంది సౌత్ పీపుల్.. తమ ఫ్యామిలీ గౌరవానికి మతం ముఖ్యమని చెప్పగా, 69% మాత్రం వ్యక్తిగతంగా చాలా ఇంపార్టెంట్ అని తెలిపారు. అంతేకాదు బీఫ్ తినే వారిని హిందువులుగా అనర్హులుగా ప్రకటించాలనే వాదన సౌత్‌లో 50 శాతం ఉంటే.. నార్త్, సెంట్రల్ పార్ట్స్‌లో 83 శాతంగా ఉంది.

ముస్లింల ట్రిపుల్ తలాక్‌కు దక్షాణాదినే ఎక్కువ మద్దతు(58%) ఉండగా, ఇక్కడి ముస్లింలలో 12% మాత్రమే దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేదని సర్వే తెలిపింది. అంతేకాదు మత విశ్వాసాల విషయానికి వస్తే.. భారతీయ ముస్లింలు కొన్ని విధాలుగా భారతీయ హిందువులను పోలి ఉంటారు తప్ప పొరుగు దేశాల ముస్లింలను పెద్దగా ఫాలో అవరని వెల్లడించింది. అట్టడుగు కులాల నుంచి చాలా మంది ప్రజలు క్రైస్తవ మతంలోకి మారారని ఎత్తిచూపిన సర్వే.. భారతదేశ మత సమూహాల మొత్తం పరిమాణంపై ఈ మార్పిడి తక్కువ ప్రభావాన్ని చూపుతుందని, ఇతర సమూహాలు కూడా ఇలాంటి స్థిరత్వాన్ని ప్రదర్శిస్తాయని చెప్పింది. దేశంలో ముస్లింలు(77% ) కర్మను నమ్ముతుండగా.. క్రైస్తవుల్లో ఈ సంఖ్య 54%. ఇక ముస్లింలు(27%), క్రైస్తవులు(29%) పునర్జన్మను నమ్ముతుండగా.. దేశవ్యాప్త సర్వేలో మూడింట రెండో వంతు(32%) క్రైస్తవులు గంగా నది శుద్దీకరణ శక్తిని నమ్ముతుండటం విశేషం.

రాజకీయాలు..

హిందూ జాతీయవాద సెంటిమెంట్లు దక్షిణాదిలో పెద్దగా పట్టించుకోరని సర్వేలో తేలింది. నిజమైన భారతీయుడిగా ఉండాలంటే హిందువుగానే ఉండాలనే భావన సౌత్‌లో 42 శాతం ఉండగా.. సెంట్రల్ స్టేట్స్‌లో 83 శాతం, నార్త్ స్టే్ట్స్‌లో 69 శాతంగా ఉంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పొందిన అత్యల్ప ఓటింగ్ పర్సంటేజ్ ఇదే విషయాన్ని రూఢీ చేస్తోంది. ఈ ప్రాంతంలోని 19 శాతం హిందువులు మాత్రమే బీజేపీకి ఓటేసినట్టుగా సర్వేలోనూ స్పష్టం కాగా.. నార్తర్న్, సెంట్రల్‌లో 68%, 65%గా ఉండటం విశేషం.

మొత్తంగా 10 మందిలో ముగ్గురు హిందువులు మూడు విషయాలను బలంగా విశ్వసిస్తున్నారు. నిజమైన భారతీయుడిగా ఉండాలంటే హిందువుగా ఉండాలని, హిందీ మాట్లాడాలని, బీజీపీకే ఓటేయాలని నమ్ముతున్నారు. ఈ భావనలన్నీ దేశంలో హిందీ మాట్లాడే ఉత్తరాది, సెంట్రల్ రీజియన్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండగా.. వీరిలో సగం మంది హిందూ ఓటర్లు ఇంచుమించు పై కేటగిరీకి చెందినవారే. అయితే దక్షిణాదిన ఇలాంటి వారు 5 శాతం మాత్రమేనని సర్వే ద్వారా తెలిసింది.

అయితే సంస్కృతీ సంప్రదాయాలే కాదు, రాజకీయపరంగా చూస్తే.. గోవధపై బీజేపీ ఆంక్షలు, హిందీ భాషను జాతీయం చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా దక్షిణాది ప్రజలు వెనక్కితగ్గారు. ఈ విషయాలు దక్షిణాదిలో తక్కువ ప్రజాదరణ కలిగిన బీజేపీకి మేలు చేసే అవకాశం ఉన్నా, ఇక్కడ ఎక్కువ మంది ప్రాంతీయ పార్టీలను లేదా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని ఇష్టపడతారన్నది తెలిసిందే.

కులం..

దేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఎక్కువ మంది దళితులు.. దక్షిణాదిన(30%), ఈశాన్యంలో(38%) తమ కులం కారణంగా వ్యక్తిగత వివక్షను ఎదుర్కొన్నట్టు ‘ప్యూ’తో చెప్పుకున్నారు. కాగా దేశంలోని సెంట్రల్ పార్ట్‌లో 13% దళితులు ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు. సౌత్‌లో 43% దళిత కమ్యూనిటీలు వివక్షను ఎదుర్కొంటున్నాయని, జనరల్ కేటగిరీలో ఆ సంఖ్య 27 శాతం ఉందని సర్వే తెలిపింది. అయితే దక్షిణాది ప్రజలు వారి కమ్యూనిటీలోనే ఎక్కువగా కుల వివక్షను చూస్తారని చెప్పిన సర్వే.. మొత్తం భారతీయుల విషయానికొస్తే కుల వివాహాలపై ఎక్కువగా అభ్యంతరాలను లేవనెత్తరని స్పష్టం చేసింది.

దక్షిణాన, దేశంలోని ఇతర ప్రాంతాల మధ్య వైఖరులతో పాటు ‘ఆర్థిక అసమానతల’ విషయంలో విస్తృత తేడాలున్నాయని తేల్చిన సర్వే.. కాలక్రమేణా నార్త్, సెంట్రల్ స్టేట్స్ కంటే సౌత్ స్టేట్స్ ఆర్థిక వృద్ధిని సాధించాయని వెల్లడించింది. అంతేకాదు దక్షిణాదిలోని అట్టడుగు కులాలకు చెందిన మహిళలు, ప్రజలు దేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఆర్థికంగా మెరుగ్గా ఉన్నారు. అయితే దేశంలో కుల వివక్ష విస్తృతంగా ఉందని పదిలో ముగ్గురు దక్షిణాది వాసులు చెప్పినప్పటికీ, ఈ ప్రాంతానికి కుల వ్యతిరేక ఉద్యమాల చరిత్ర కూడా ఉండటం కొసమెరుపు.



Next Story

Most Viewed