జాబ్ రావడం లేదని బావిలో దూకిన ఉద్యమనేత..

by  |
జాబ్ రావడం లేదని బావిలో దూకిన ఉద్యమనేత..
X

దిశ, వేములవాడ : ప్రత్యేక తెలంగాణ వస్తే ఇంటింటికి ఉద్యోగాలు వస్తాయని, నిరుద్యోగుల బతుకులు బాగుపడతాయని ఉద్యమం చేసిన ఓ నాయకునికే ఉద్యోగం రాలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అతను వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..ముచ్చర్ల మహేందర్ యాదవ్ (30) అనే ఉద్యమ నాయకుడు జాబ్ రాలేదనే కారణంతో గ్రామ శివారులో గల బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహేందర్ యాదవ్ టీఆర్ఎస్వీకి అనుబంధంగా తెలంగాణ యాదవ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ విద్యార్థుల సమస్యల పట్ల నిరంతరం పోరాడేవాడు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలు చేసి విద్యార్థులను ఉద్యమంలో పాల్గొనేలా చైతన్య పరిచేవాడు. బీటెక్ కంప్లీట్ చేసిన మహేందర్ కొంతకాలంగా రాష్ట్రంలో ఎలాంటి నోటిఫికేషన్ రావడం లేదని, భవిష్యత్తులో కూడా తనకు ఉద్యోగం రాదనే బెంగతో కొద్దిరోజులుగా తన ఫ్రెండ్స్‌, కుటుంబ సభ్యులతో చెప్పుకుంటూ బాధపడే వాడని తెలిసింది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి వారికి ఉపాధి అందేలా చూడాలని మహేందర్ తల్లిదండ్రులు కొమురయ్య, రామవ్వలు కోరుతున్నారు. తన కొడుక్కు పట్టిన గతి మరే నిరుద్యోగ యువతకు పట్టకూడదని బాధితులు బోరున విలపించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.

Next Story

Most Viewed