కరోనా సోకిందని ఒక్కసారిగా మద్యం మానేసి.. చెరువులో శవమై తేలాడు

by  |
dealer-died 1
X

దిశప్రతినిధి, మహబూబ్ నగర్ : కరోనా సోకిందని సడన్‌గా మద్యం మానేయడంతో చివరకు మతిస్థిమితం కోల్పోయి.. చెరువులో పడి రేషన్ డీలర్ మృతి చెందిన ఘటన శుక్రవారం బూత్ పూర్ మండల మొగుళ్ల చెరువులో వెలుగు చూసింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. పోతులమడుగు గ్రామానికి చెందిన కురుమయ్య(35) గత కొన్నేళ్ల నుంచి రేషన్ డీలర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల కురుమయ్యకు కరోనా సోకడంతో వైద్యులు మందులు ఇచ్చి మందు తాగకూడదని సలహా ఇచ్చారు.

మద్యానికి బానిసైన కురుమయ్య ఒక్కసారిగా మద్యం మానేయడంతో మతిస్థిమితం కోల్పోయాడు. 4 రోజుల కిందట రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎవరికీ చెప్ప చేయకుండ బయటకు వెళ్లాడు. చీకటి కావడంతో ఎక్కడికు వెళ్ళడని కుటుంబ సభ్యులు భావించారు. ఉదయం వరకు కూడా తిరిగి రాకపోవడంతో అతని గురించి తెలిసిన వారి దగ్గర ఆరా తీసిన ప్రయోజనం లేకపోయింది. శుక్రవారం సాయంత్రం బూత్ పూర్ మండల కేంద్రానికి సమీపంలోని మొగుళ్ల చెరువులో నీటిపై తేలియాడుతూ మృతదేహం కనిపించినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆరా తీయగా అతను డీలర్ కురుమయ్యగా గుర్తించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు భూత్పూర్ ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు.


Next Story

Most Viewed