పల్లెకు పోదాం.. పండుగ చూద్దాం

by  |
పల్లెకు పోదాం.. పండుగ చూద్దాం
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: హైదరాబాద్ మహానగర వాసులు పట్నం వదిలి పల్లె బాట పడుతున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో మహానగరంలో అత్యధిక శాతం స్థిరపడిన ఏపీ వాసులంతా పర్వదినం కోసం సొంత గ్రామాలకు పయనమయ్యారు. హైదరాబాద్‌లో 60 శాతానికి పైగా ఉన్న ఏపీ వాసులు సంక్రాంతి పండుగ కోసం బయలుదేరడంతో జాతీయ రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. కరోనా నేపథ్యంలో అధిక శాతం మంది సొంత వాహనాలు, కార్లలో వెళ్లేందుకు మొగ్గు చూపుతుండడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాలుగు ప్రధాన టోల్ ప్లాజాల వద్ద వందల సంఖ్యలో వాహనాలు బారులుదీరుతున్నాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులుదీరిన పరిస్థితిపై ‘దిశ’ ప్రత్యేక కథనం.

వాహనాల ఉమ్మడి నల్లగొండ మీదుగానే రాకపోకలు..

హైదరాబాద్ మహానగరం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలంటే ప్రధాన దారి ఉమ్మడి నల్గొండ. పంతంగి(చౌటుప్పల్), కొర్లపహాడ్, మాడ్గులపల్లి, గూడురు(బీబీనగర్) ప్రాంతాల్లో టోల్ ప్లాజాలున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు అధిక శాతం సొంత వాహనాలు, క్యాబ్​లకు ఎక్కువ ప్రయార్టీ ఇస్తుండడంతో టోల్​ప్లాజాల వద్ద కార్ల రద్దీగా ఎక్కువగా కనిపిస్తున్నది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి కనిపిస్తున్నది.

నిత్యం 50 వేలకు పైగా వాహనాలు..

సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులుదీరాయి. సాధారణ రోజుల్లో టోల్ ప్లాజాల మీదుగా 15 వేల నుంచి 20 వేల వాహనాలకు పైగా రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రస్తుతం నిత్యం 50 వేల వాహనాలకు పైగా టోల్ ప్లాజాను క్రాస్ చేస్తున్నాయి. గతేడాది జనవరి 11న పంతంగి టోల్ ప్లాజా మీదుగా 50,275 వాహనాలు ఏపీకి వెళ్లాయి. ఈ ఏడాది జనవరి 9న అదే టోల్ ప్లాజా మీదుగా రాత్రి 11 గంటల సమయానికి 35 వేల వాహనాలు వెళ్లినట్టు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు. ఇందులో గతేడాది ఏపీకి వెళ్లిన 50 వేల వాహనాల్లో 25 వేల వాహనాలు ఫాస్టాగ్ ద్వారా వెళ్లాయి. వాస్తవానికి ప్రతి ఏటా ఇదే తరహాలో టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ ఉంటుంది.

మొరాయిస్తున్న ఫాస్టాగ్ స్కానర్..

కేంద్ర ప్రభుత్వం టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ను జనవరి 1, 2021 నుంచి ఖచ్చితంగా అమలు చేస్తామని ముందస్తుగా ప్రకటించినా, ఆ నిర్ణయాన్ని విరమించుకుని ఫిబ్రవరి 28 వరకు పొడగించింది. ఇప్పటికే దాదాపు 70 శాతం వాహనదారులు ఫాస్టాగ్ చేయించుకోగా, మిగిలిన 30 శాతం మంది స్పాట్ పేమెంట్ చేసి వెళ్తున్నారు. అయితే వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద నిరీక్షించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఫాస్టాగ్‌ను అమలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చేబుతోంది. కానీ టోల్ ప్లాజాల వద్ద పరిస్థితి అందుకు విరుద్ధంగా తయారైంది. సాంకేతిక కారణాల నేపథ్యంలో ఫాస్టాగ్ స్కానర్ వాహనాలను స్పీడ్‌గా స్కాన్ చేయడం లేదు. దీంతో వాహనదారులు నిరీక్షించాల్సి వస్తుంది. ఏదీఏమైనా జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా సేఫ్ అండ్ హ్యాపీ జర్నీ కావాలని ఆశిద్దాం.


Next Story

Most Viewed