ఈ ఆస్పత్రికి ఊపిరి కావాలి

by  |
ఈ ఆస్పత్రికి ఊపిరి కావాలి
X

దిశ, హుస్నాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడంలో భాగంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరం గ్రామశివారులో 2014 మార్చి 1న వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ(ఎన్ఆర్‌హెచ్ఎం) నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించేందుకు అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి భూమిపూజ చేశారు. తక్కువ సమయంలోనే కాంట్రాక్టర్ ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేశారు. రెండు ధపాలుగా సతీష్‌కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నేటికీ ప్రారంభించలేదు.

దీంతో పాలకులు, అధికారుల తీరుపై పరిసర గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కన్నపేట మండలం గిరిజన తండాలను కలుపుకొని 32 గ్రామ పంచాయతీలతో సిద్దిపేట జిల్లాలోనే అతిపెద్ద మండలంగా 2016 అక్టోబర్‌లో ఏర్పడింది. తండాల్లోని ప్రజలకు రాత్రి వేళల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రథమ చికిత్స కోసం హుస్నాబాద్, కరీంనగర్, వరంగల్, జనగాం, సిద్దిపేట జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటే సుమారు 50 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో వైద్యం అందక కొందరు మృతి చెందిన సందర్భాలూ ఉన్నాయి. ప్రైవేటుకు ధీటుగా సర్కార్ వైద్యాన్ని అందిస్తామన్న పాలకుల వాగ్ధానాలు మాటలకే పరిమితమయ్యాయి. నాలుగేండ్ల క్రితం ఏర్పడిన కొత్త మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీలు, సర్పంచ్ స్థానాలను టీఆర్ఎస్‌కు చెందిన నాయకులే దక్కించుకోగా అందులో గిరిజన ప్రజాప్రతినిధులే ఎక్కువగా ఉన్నారు.

మారుమూల తండాల్లోని గిరిజనులు, నిరుపేద ప్రజలకు సర్కార్ వైద్యం అందకపోవడంతో సాధారణ జ్వరానికి సైతం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. రూ.లక్షలు ఖర్చు చేసి పీహెచ్‌సీ భవనం నిర్మించినా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో మందుబాబులు దీనిని అడ్డాగా మార్చుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సతీష్‌కుమార్ చొరవ తీసుకొని ఆస్పత్రికి వైద్య సిబ్బందిని నియమించడంతో పాటు వైద్య సేవలు అందుబాటులో తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

అందుబాటులోకి తీసుకురావాలి : వనేష్, సీపీఐ మండల కార్యదర్శి

ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తయి ఏండ్లు గడుస్తున్నా ప్రజలకు వైద్యం అందుబాటులోకి రాలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటి చెప్పి మరొకటి చేస్తోంది. ఆస్పత్రికి కేటాయించిన పలు పరికరాలు, ఫర్నిచర్ పూర్తిగా పాడైపోతున్నాయి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురావాలి

ప్రేక్షక పాత్ర పోషిస్తున్న ప్రజాప్రతినిధులు : అయిలయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు

ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ప్రేక్షక పాత్రను పోషిస్తున్నారు. ఒక వైపు కరోనా మరో వైపు సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటే పాలకులు, అధికారులు అవగాహన కల్పించడం లేదు. ప్రజలకు వాటిపై అవగాహన కల్పించి ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలి.

వైద్యం అందడం లేదు : వీరాచారి, బీజేపీ మండలాధ్యక్షుడు

పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలకు సర్కార్ వైద్యం అందడం లేదు. దూర ప్రాంతాలకు పోయి, ప్రైవేట్ ఆస్పత్రుల్లో డబ్బులు పెట్టలేక అప్పుల పాలవుతున్నారు. వెంటేనే ఆస్పత్రికి వైద్యులను కేయించి వైద్యాన్ని అందించాలి.

Next Story