లాక్ డౌన్.. సడలింపుల‌పై ఆశ..

by  |
లాక్ డౌన్.. సడలింపుల‌పై ఆశ..
X

దిశ, మహబూబ్‌నగర్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) వ్యాప్తి కట్టడికి విధించిన లాక్ డౌన్ గడువు తెలంగాణలో మే 7వ తేదీతో ముగియనుంది. దీంతో ఆ తర్వాత 8‌వ తేదీ నుంచి లాక్ డౌన్ ఎత్తివేస్తారా.? లేదా..ఏమైనా సడలింపులిస్తారా..అనే అంశం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. గత కొన్ని రోజులుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొవిడ్ కేసులు తగ్గుతున్న క్రమంలో ప్రజలు లాక్ డౌన్ ఎత్తివేత‌పై అనేక ఆశలు పెట్టుకున్నారు. లాక్ డౌన్‌తో చిన్న, మధ్యతరగతి కుటుంబాల వారి పరిస్థితి ఇప్పటికే దినదిన గండంగా మారిన నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం కేంద్రం మాదిరిగా కొంత సడలింపులు ఇస్తుందని వారు అనుకుంటున్నారు. అయితే, సోషల్ మీడియాలో మరో రెండు వారాల పాటు తెలంగాణలోనూ లాక్ డౌన్ పొడగింపు ఉంటుందన్న ప్రచారం వారిని కలవరపెడుతోంది.

వనపర్తి సేఫ్..

వారం రోజులుగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎక్కడా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతామైన జోగుళాంబ గద్వాల జిల్లాలో వైరస్ వ్యాప్తి చాలా వేగంగా వ్యాపించినప్పటికీ వారం రోజులుగా అక్కడ పరిస్థితులు కొంత కుదుటపడ్డాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 38 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వారి లెక్కల ప్రకారం మహబూబ్‌నగర్‌లో మొత్తం 11 కేసులు నమోదు అవ్వగా 8మంది డిశ్చార్జ్ కాగా 3 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గద్వాల జిల్లాలో 49 కేసులు నమోదు కాగా 14మంది డిశ్చార్జ్ కాగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో 33 యాక్టవ్ కేసులున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో 2 కేసులు నమోదు అవ్వగా ఇంకా ఆ 2 కేసులు యాక్టివ్‌గానే ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో 1 కేసు నమోదు కాగా, ఆ ఒక్కరు మరణించారు. ఇంకా యాక్టివ్ కేసులేమీ లేవు. వనపర్తి జిల్లాలో ఎలాంటి కేసులు నమోదు కాకపోవడంతో ఆ జిల్లా సేఫ్ జోన్‌లో ఉంది.

కొనసాగుతున్న కంటైన్‌మెంట్ జోన్లు..

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రామయ్యబోలి, బి.కె.రెడ్డి కాలనీ, జడ్చర్లలోని కావేరమ్మపేట, గద్వాలలోని దేవేంద్రనగర్, నల్లకుంట, రాంనగర్, పాత హౌసింగ్ బోర్డు, భీంనగర్, గంజిపేట, వేదానగర్, జమ్మిచెడ్డు, అంబేద్కర్ నగర్, ఇట్టిక్యాల మండలంలోని వల్లూరు, పాత రాజోళి, టీచర్స్ కాలనీ, అయిజ
మండలంలోని మునగానిపల్లి, అలంపూర్ లోని లింగవాయి ప్రాంతాల్లు కంటైన్‌మెంట్‌లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాలు ఆరెంజ్ జోన్లుగా కొనసాగుతుండగా వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలు గ్రీజ్ జోన్లలో కొనసాగుతున్నాయి. మే 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ ప్రజల్లో ఉంది. సడలింపులు ఇస్తే ప్రజలు సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) ఎంతవరకు పాటిస్తారు.? పనులు ఎలా చేసుకుంటారు? అనే విషయమై అధికారులు చర్చించుకుంటున్నారు. కాగా, ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ పొడగిస్తే తమ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని మధ్యతరగతి, పేద ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags: covid 19 effect, lock down, pull out, or extension, relaxation, of certain conditions, corona virus



Next Story

Most Viewed