గడప దాటలేరు.. గొంతు తడ్పుకోలేరు!

by  |
గడప దాటలేరు.. గొంతు తడ్పుకోలేరు!
X

దిశ, మెదక్: ప్రపంచామంతా కరోనా కల్లోలంలో అతలాకుతలమౌతోంది. నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) మహమ్మారి కట్టడికి విధించిన లాక్ డౌన్‌తో ఆర్థిక వ్యవస్థలు ఆగమవుతున్నాయి. సంస్థలు, ఫ్యాక్టరీలు మూతపడుతుండగా వాటిపై ఆధారపడిన రోజువారీ కూలీలు, ఇతర కులవృత్తుల వారు ఉపాధి కోల్పోయారు. ఈ కరోనా కదనరంగంలో వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు యోధుల్లా పోరాడుతున్నారు. ఇదిలా అండగా అక్కడ మాత్రం తాగు నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకెళితే.. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పట్టణ‌వాసులు 3 నెలల నుంచి తాగునీటి సమస్య ఎదర్కొంటున్నారు. జహీరాబాద్ పట్టణ పురపాలక సంఘం పరిధిలో గతంలో 24 వార్డులు ఉండగా ఏడాది కిందట నిర్వహించిన పురపాలక సంఘాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత 37 వార్డులుగా విస్తరించాయి. జహీరాబాద్ పట్టణ ప్రజల తాగునీటి కోసం ప్రధాన జీవనాధారమైన మంజీరా నది పూర్తిగా ఎండిపోయింది. ప్రత్యామ్నాయ ఏర్పాటు లేకపోవటం వల్ల వారు తాగునీటికి నానా తంటాలు పడుతున్నారు.

పట్టణ ప్రజల గృహ వినియోగ నిమిత్తం ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పరిసర ప్రాంతాలలో వ్యవసాయ బావుల నుంచి ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా నీరు ఆయా బస్తీలకు సరఫరా చేస్తున్నారు. అయినా నీరు 4 రోజులకు ఒకసారి అందుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఆయా వార్డులలో గతంలో వేసిన పాడైపోయినటువంటి బోరుబావులను ప్రజల నీటి అవసరాల కోసం వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. అయితే, ఈ విషయమై సంబంధిత పురపాలక శాఖ అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ప్రజల గృహ వినియోగ అవసరాల నిమిత్తం పరిసర ప్రాంతాల వ్యవసాయ క్షేత్రాల నుంచి ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే ప్రక్రియను ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ నిర్వహిస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తాగునీరు అందించేందుకు తగుచర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఎందుకంటే కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్‌తో ప్రజలు గుమ్మం దాటే పరిస్థితి లేదని చెబుతున్నారు.

Tags: difficulties, people, drinking water, corona times, covid 19, lockdown, no availability of water

Next Story