ఈటలది దింపుడు కల్లం ఆశే : ఇనుగాల పెద్ది రెడ్డి

by  |
ఈటలది దింపుడు కల్లం ఆశే : ఇనుగాల పెద్ది రెడ్డి
X

దిశ, హుజురాబాద్ రూరల్ : బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ది దింపుడు కల్లం ఆశేనని, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తాయని మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అన్నారు. గురువారం స్థానిక టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా, మంత్రిగా హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈటల చేసింది శూన్యమని విమర్శించారు.

దళితబంధు, రైతు బంధు, రైతు భీమాతో పాటు సొంత స్థలాల్లో ఇండ్లు కట్టించడానికి నియోజకవర్గానికి 1,500 ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 7 ఏళ్లు మంత్రిగా పనిచేసిన ఈటల.. వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తూ ఎన్నికల సంఘాన్ని ధిక్కరిస్తున్నారన్నారు.

బాధ్యతాయుతంగా వ్యవహరించని అభ్యర్థులపై ఈసీ దృష్టి సారించాలని కోరారు. తప్పుడు ప్రచారం మాని ఉప ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తావో చెప్పాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



Next Story