వరంగల్‌లో గంజాయి స్మగ్లర్లపై‌ పీడీ యాక్ట్

by  |
వరంగల్‌లో గంజాయి స్మగ్లర్లపై‌ పీడీ యాక్ట్
X

దిశ‌, హ‌న్మకొండ టౌన్: వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో ఇద్దరు గంజాయి స్మగ్లర్లపై.. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి బుధవారం పీడీ యాక్ట్ ఉత్తర్వులను జారీచేశారు. క‌మిష‌న‌ర్ ఆదేశాల మేర‌కు పీడీ యాక్ట్ ఉత్తర్వుల‌ను నిందితులైన‌ విశాఖ ప‌ట్టణానికి చెందిన ద్వారపూడి మణికూమార్ అలియాస్ దుర్గా, వ‌రంగ‌ల్ జిల్లా చెన్నారావుపేట మండ‌లం తోవనగడ్డ తండాకు చెందిన బానోత్ విద్యా (34)ల‌కు.. ఇంతేజాగంజ్ ఇన్‎స్పెక్టర్ డి. మల్లేష్ అంద‌జేశారు. నిందితులకు పీడీ యాక్ట్ ఉత్తర్వులను ఖమ్మం కారాగారంలో జైలర్ సమక్షంలో అందజేశారు. అనంతరం నిందితులను పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.

పోలీసులు విడుద‌ల చేసిన ప్రక‌ట‌న ప్రకారం.. నిందితులిద్దరూ విశాఖపట్నం జిల్లాలోని డౌనూరు, చింతపల్లి, నర్సీపట్నం ప్రాంతాల నుంచి సేకరించిన గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసేవారు. వాటిని రెండు కిలోల చొప్పున ప్యాకింగ్ చేసి గంజాయి ప్యాకెట్లను రైలు ద్వారా మహారాష్ట్ర, ములుగు, నర్సంపేట ప్రాంతాలకు చేరవేసేవార‌ని సీఐ తెలిపారు. నిందితులు గంజాయి స్మగ్లింగ్ చేసే సమయంలో ఎవరికి అనుమానం కలగకుండా.. గంజాయిని ఖరీదైన బ్యాగుల్లో భద్రపర్చి ఏసీ బోగీల్లో ప్రయాణించేవారు.

ఈ తరహాలో నిందితులు గత నాలుగు సంవత్సరాలుగా గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతుండగా.. విశ్వసనీయ సమాచారం మేరకు గత అక్టోబర్ నెల 22వ తేదీన టాస్క్‌ఫోర్స్, ఇంతేజాగంజ్ పోలీసులు సంయుక్తంగా కలిసి వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద అరెస్టు చేశారు. వీరి నుండి రూ. 3 లక్షల విలుగల 32 కిలోల గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యువతను మత్తు బానిసలుగా మార్చి వారి భవిష్యత్తుపై దుష్ప్రభావానికి గురిచేస్తున్న గంజాయి స్మగ్లర్లను ఉపేక్షించేది లేదని.. ఇటువంటి వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారని సీఐ మల్లేష్ గుర్తు చేశారు.



Next Story

Most Viewed