యువతులతో వ్యభిచారం.. దంపతుల ఆటకట్టించిన సీపీ

by  |
women trafficking
X

దిశ, తెలంగాణ బ్యూరో : యువతుల అక్రమ రవాణాకు పాల్పడి, అనంతరం వ్యభిచారం రొంపిలోకి దింపుతున్న దంపతులపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్‌లో చందన నాగ రవిరాజా, చందన సునీత అలియాస్ అనూష అనే భార్యాభర్తలిద్దరూ గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

పక్కా సమాచారం మేరకు వారిని సరూర్ నగర్, రాచకొండ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో జూన్ 15వ తేదీన పట్టుకున్నట్లు తెలిపారు. వారితో పాటు ఒక విటుడిని, బాధితురాలైన ఒక మహిళను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అనంతరం వారిని కోర్టు ఎదుట హాజరుపరచగా రిమాండ్ ఉత్తర్వులకు అనుగుణంగా జైలుకు పంపినట్లు పేర్కొన్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా ఈ దంపతులు యువతులకు ఉపాధి కల్పించే నెపంతో మాయమాటలు చెప్పి ఆపై బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారన్నారు.

కాలేజీకి వెళ్లే స్టూడెంట్లనే వీరు టార్గెట్‌గా పెట్టుకున్నారని, ఇలాంటి వారి మాయమాటలను నమ్మొద్దని సీపీ సూచించారు. కాగా ఈ దంపతులను శుక్రవారం చెర్లపల్లి, చంచల్ గూడ సెంట్రల్ జైళ్లకు తరలించినట్లు చెప్పారు. యువతుల అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతోందన్నారు.



Next Story

Most Viewed