కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే అర్హత లేదు : ఉత్తమ్

by  |
కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే అర్హత లేదు : ఉత్తమ్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నియంత్రిత సాగు విధానం రద్దుతో పాటు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను కూడా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించడంపై ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రకటన రైతులను అవమాన పర్చేలా ఉందని అన్నారు. ఆ ప్రకటన నిజమైతే కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. 70శాతం వ్యవసాయంపై ఆధారపడిన టీఆర్ఎస్ రైతులతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. ప్రాథమిక బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకుందని, ఆరేండ్లలో అప్పులు చేసి కాంట్రాక్టులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. రైతులకు మద్దతు ధర ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. ఏడేండ్లలో రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పిన ప్రభుత్వం, రైతుల మద్దతు ధర కోసం రూ.7వేల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని చెప్పడం అసమర్ధకు నిదర్శనం అన్నారు.

ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మారిస్తే కేంద్రం కొనుగోలు చేస్తుందని, ఆలస్యమైతే కేంద్రం దానికి వడ్డీకూడా ఇస్తుందని, ధాన్యం కొనుగోలు విషయంలో నష్టం ఎలా వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రతి గ్రామంలో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటే అని ఈ ప్రకటనతో అర్ధం అవుతుందని, ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నాడని వెల్లడించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత పంట బీమా ఎందుకు రద్దు చేశారో చెప్పాలని నిలదీశారు. అంతేగాకుండా రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఉత్తమ్ కుమార్ డిమాండ్ చేశారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను 2004లో కాంగ్రెస్ ప్రారంభించిందని గుర్తుచేశారు. కరోనా నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పిన అధికారులకు జ్ఞానం ఉండాలని వ్యాఖ్యానించారు. దీనిపై బుధవారం(రేపు) నుంచి జనవరి 7వరకు మండల కేంద్రాల్లో నిరసన తెలిపి తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇస్తామన్నారు.


Next Story

Most Viewed