పాక్‌లో పర్యటించనున్న ఇంగ్లాండ్ జట్టు

by  |
పాక్‌లో పర్యటించనున్న ఇంగ్లాండ్ జట్టు
X

దిశ, స్పోర్ట్స్: పదకొండేళ్ల క్రితం(2009) పాకిస్తాన్‌లో పర్యటించిన శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగినప్పట్నుంచీ ఆ దేశంలో ఏ క్రికెట్ జట్టూ పర్యటనకు వెళ్లలేదు. పాక్‌తో జరగాల్సిన పలు ద్వైపాక్షిక సిరీస్‌లో యూఏఈ వేదికగానే జరుగుతున్నాయి. ఇక ఇంగ్లాండ్ జట్టు చివరిసారిగా 2005లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లింది. కాగా, 17 ఏళ్ల తర్వాత 2022లో ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నట్లు పాక్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) సీఈవో వాసిమ్ ఖాన్ గురువారం వెల్లడించారు. కొవిడ్-19 నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) ఆటను పునఃప్రారంభించాలని భావించినప్పుడు వెస్టిండీస్, పాకిస్తాన్ జట్లే సహకారం అందించాయి. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించే వాతావరణం ఉన్నా విదేశాలకు వచ్చిన ఈ రెండు దేశాల క్రికెటర్లు ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లకు సిద్ధపడ్డారు. దీంతో ఈసీబీ కూడా ఈ రెండు క్రికెట్ బోర్డులకు చేతనైన సాయం చేయాలని భావించింది. ఇప్పటికే విండీస్ జట్టుకు రుణమిచ్చి ఆదుకున్నది. ఇక పీసీబీ అయితే ఇంగ్లాండ్ జట్టును తమ దేశంలో పర్యటనకు వచ్చేలా చేయాలని ఈసీబీని పట్టుబడుతున్నది. ప్రస్తుతానికి ప్రతిపాదనల దశలోనే ఉన్నప్పటికీ ఈ ద్వైపాక్షిక సిరీస్‌పై ఇరు దేశాల క్రికెట్ బోర్డులు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

Next Story

Most Viewed