పేటీఎం చేతికి రహేజా క్యూబీఈ

by  |
పేటీఎం చేతికి రహేజా క్యూబీఈ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక సేవలను విస్తరించే క్రమంలో ప్రముఖ డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎం, సీఈవో విజయ్ శేఖర్ శర్మ ముంబై కేంద్రంగా పనిచేసే ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ రహేజా క్యూబీఈని కొనుగోలు చేయనున్నారు. ఈ సంస్థలో మొత్తం వంద శాతం వాటాను పేటీఎం కొనుగోలు చేయనుంది. అయితే, ముంబైతో పాటు పలు ప్రాంతాల్లోని క్యూబీఈ ఉద్యోగులు ఇప్పుడున్న ప్రకారమే కొనసాగుతారని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇక, ఈ ఒప్పందం విలువ రూ. 568 కోట్లుగా భావిస్తున్నారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) నుంచే వచ్చే ఆమోదాన్ని బట్టి 2021 మార్చి 31నాటికి ఈ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసే పేటీఎం మాతృసంస్థ వన్97 ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

ఈ సందార్భంగా స్పందించిన పేటీఎం అధ్యక్షుడు అమిత్ నయ్యర్.. పేటీఎం ఆర్థిక సేవల ప్రయాణంలో ఇదొక కీలక మైలురాయి అని, రహేజా క్యూబీఈని పేటీఎం కుటుంబంలోకి స్వాగతిస్తున్నామని తెలిపారు. క్యూబీఈ జనరల్ ఇన్సూరెన్స్ విభాగంలో పటిష్టమైన నిర్వహణ బృందాన్ని కలిగి ఉంది. దీని కొనుగోలుతో భారత్‌లోని ప్రజలకు మరింత చేరువ కావడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. కాగా, రహేజా క్యూబీఈ సంస్థలో ప్రిజమ్ జాన్సన్ యాజమాన్యం 51 శాతం వాటా, క్యూబీఈ ఆస్ట్రేలియాకు 49 శాతం వాటా కలిగి ఉన్నాయి. రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం.. రహేజా క్యూబీఈ జనరల్ ఇన్సూరెన్స్ 2020 మార్చి 31 నాటికి ఆదాయం రూ. 189.46 కోట్లు, నికర విలువ రూ .154.38 కోట్లుగా ఉంది.

Next Story

Most Viewed