పేటీఎం ట్రాన్సిట్ కార్డు.. ఇక అన్ని లావేదేవీలు ఒకే చోటనుంచి..

by  |
Paytm
X

దిశ, వెబ్‌డెస్క్: డిజిటల్ చెల్లింపు సంస్థ పేటీఎం తన అనుబంధ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా అన్ని అవసరాలకు వాడేందుకు వీలుగా ‘ట్రాన్సిట్ కార్డు’ను ప్రారంభించింది. దీన్ని ఉపయోగించి మెట్రో, రైల్వే, రాష్ట్ర ప్రభుత్వ బస్సు సర్వీసులు, టోల్ పార్కింగ్ ఛార్జీలు, ఆన్‌లైన్ షాపింగ్, స్టోర్లలో లావాదేవీలు నిర్వహించవచ్చని పేటీఎం తెలిపింది. అంతేకాకుండా ఈ కార్డును ఏటీఎం నుంచి నగదు తీసుకునేందుకు కూడా వినియోగించవచ్చని కంపెనీ పేర్కొంది. హైదరాబాద్ మెట్రో, అహ్మదాబాద్ మెట్రో, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌ల సహకారంతో మొదటి దశ ప్రారంభిస్తున్నామని, ఈ కార్డు ద్వారా వినియోగదారులు అవాంతరాలు లేని లావాదేవీలను నిర్వహించవచ్చని కంపెనీ వివరించింది.

ఇది ప్రభుత్వ వన్‌ నేషన్‌ వన్‌ కార్డ్‌ నినాదానికి అనుగుణంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. భారత్‌లోని వినియోగదారులు బ్యాంకింగ్ లావాదేవీలను సులభంగా చేసేందుకు ఈ కార్డు ఎంతో ఉపయోగపడుతుందని, కార్డు కోసం వినియోగదారులు దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఇంటికే డెలివరీ చేయనున్నట్టు పేటీఎం స్పష్టం చేసింది. అలాగే, విక్రయ కేంద్రాల్లోనూ కొనవచ్చని, ఈ ప్రీపెయిడ్ కార్డు నేరుగా పేటీఎం వ్యాలెట్‌కి లింక్ చేసి ఉంటుందని వివరించింది.

పేటీఎం ట్రాన్సిట్ కార్డు రోజువారీ అవసరాలకు అనుగుణంగా చిన్న చిన్న లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా ఉంటుంది. దీన్ని దేశంలోని ఏ మెట్రోలో అయినా వాడుకోవచ్చు. ఒకే కార్డును ప్రజలు అన్ని రకాల పనులకు వినియోగించుకునేందుకు వీలుగా ఉంటుందని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎండీ, సీఈఓ సతీష్ గుప్తా అన్నారు.


Next Story

Most Viewed