ఫిట్​మెంట్ ముందు.. తర్వాతే చర్చలు!​

by  |
CM KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంశం అనేక మలుపులు తిరుగుతోంది. ఉద్యోగ సంఘాలతో చర్చించకుండానే సీఎం కేసీఆర్ ఫిట్​మెంట్​​ ప్రకటిచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పండుగ తర్వాత పీఆర్సీపై జీవో జారీ చేస్తారని తెలుస్తోంది. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలకు కూడా ప్రాథమికంగా సమాచారమిచ్చారు. ఫిట్​మెంట్​ ప్రకటించాక బెనిఫిట్స్​ అంశంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. పీఆర్సీ నివేదికను సీఎం కేసీఆర్​కు అందించినట్లు చెబుతున్నారు. సీఎం ప్రకటించే వరకూ ఇది లీక్​ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈసారి 30 శాతం వరకు ఫిట్​మెంట్​ ఇస్తారని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదనుకుంటున్నారు.ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి కూడా లెక్కలు సేకరిచారని చెబుతున్నారు.

ఎటూ తేలదనే..

ముందుగానే ఉద్యోగ సంఘాలతో చర్చిస్తే ఎటూ తేలకుండా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఉద్యోగ వర్గాలలో పీఆర్సీ అంశంలో చాలా వ్యతిరేకత ఉంది. అందుకే ముందుగా ఫిట్​మెంట్​ ప్రకటించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఉద్యోగులకు వివరించాల్సిన బాధ్యతలను సంఘాలపైనే వేయనున్నట్లు చెబుతున్నారు. ఫిట్​మెంట్​ను 2020 జూలై నుంచైనా, అంతకు ముందు ఏడాది నుంచైనా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని, నగదు జమ మాత్రం ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి చెల్లింపులు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈసారి కూడా ఉద్యోగులు ఏడాది కాలం పీఆర్సీని నష్టపోవాల్సి వస్తుందనే సంకేతాలు ఇస్తున్నారు. ఏరియర్స్​ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, ఏరియర్స్​ ఇస్తే పీఎఫ్​ ఖాతాలలో కొన్ని నెలలు జమ చేసే అవకాశం ఉందని కూడా చర్చించుకుంటున్నారు. దీనిపై ఎక్కడి నుంచీ సమాచారం ఇవ్వడం లేదు.

పిలుపు కోసం..

ముందుగా పీఆర్సీ అంశాన్ని తేల్చేందుకు సీఎం కేసీఆర్​ దాదాపుగా సిద్ధమయ్యారని అధికారవర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత జీవో జారీ అవుతుందని అంటున్నారు. జీవో జారీ చేసి, ఉద్యోగులతో మాట్లాడేందుకు నిర్ణయం తీసుకున్నారంటున్నారు. ఉద్యోగ సంఘాలు మాత్రం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాయి. ఈ వారమంతా ప్రగతిభవన్ నుంచో, సచివాలయం నుంచో పిలుపు వస్తుందనే ఆశతో ఉన్నారు. నేడు.. రేపు అంటూ ఎదురుచూశారు. సీఎం కేసీఆర్​ ప్రకటించిన త్రీమెన్ కమిటీ భేటీ కాలేదు. సీఎస్​ అధ్వర్యంలో ఫైనాన్స్​, ఇరిగేషన్​ ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్​ కుమార్​లతో త్రిసభ్య కమిటీని ప్రకటించిన విషయం తెలిసిందే. పీఆర్సీ నివేదిక అందిన వెంటనే అధ్యయనం చేయాలని, ఆ తర్వాత ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడాలని సీఎం సూచించారు. అవేమీ జరుగలేదు. సీల్డ్​ కవర్​ నివేదికను సీఎంకే ఇస్తామని సీఎస్​ వెల్లడించారు. కమిటీ సభ్యులకు సమాచారం కూడా ఇవ్వలేదు. కలెక్టర్ల సమావేశం రోజున సీల్డ్​ కవర్​ను సీఎంకు ఇచ్చినట్లు అధికార వర్గాలలో ప్రచారం జరిగింది. కొంతమంది ఉన్నతాధికారులు మాత్రం దీన్ని కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో పండుగ తర్వాత పీఆర్సీపై జీవో వస్తుందని ఉన్నతాధికారులు చెప్పారని తెలుస్తోంది.


Next Story