టీటీడీ భూములపై పవన్ ట్వీట్… ఏమన్నారంటే !

by  |
టీటీడీ భూములపై పవన్ ట్వీట్… ఏమన్నారంటే !
X

దిశ, ఏపీ బ్యూరో: భవిష్యత్‌లో రెవెన్యూకు ఉపయోగపడే ఆస్తులను ప్రభుత్వం విక్రయించొద్దని, టీటీడీ భూముల్ని వేలం వేయకుండా ఆపాలని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. టీటీడీ భూముల అమ్మకం విషయంపై పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశంలోని అన్ని హిందూ దేవాలయాలు, సంస్థలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తాయన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యధిక ఆదాయం వచ్చే దేవాలయాల్లో ఒకటిగా ఉన్న టీటీడీ మంచి పద్ధతులను అనుసరించడం ద్వారా ఇతర సంస్థలకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. టీటీడీ భూములను విక్రయిస్తే, ఇతర దేవాలయ బోర్డులు సైతం ఇదే పంథా కొనసాగించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ఇప్పటికీ పూర్తిస్థాయి రాజధాని లేదని, మరోవైపు ఆర్థిక పరిస్థితి కూడా చాలా బలహీనంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీకి పెట్టుబడులు, ఉద్యోగాలు కావాలని అన్నారు. అదే సమయంలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవాలని సూచించారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ భూములు రెవెన్యూను పెంచుకునేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. అందుకే భూములను ప్రభుత్వం పరిరక్షించాలని సూచించారు. భక్తుల నమ్మకాలు, మనోభావాలు దెబ్బతీయడం సరికాదని హితవు పలికారు.



Next Story