క్షీణించిన ఆటో అమ్మకాలు.. వాటి కొరతే కారణం..

by  |
క్షీణించిన ఆటో అమ్మకాలు.. వాటి కొరతే కారణం..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో దేశీయ ఆటో కంపెనీలు హోల్‌సేల్ అమ్మకాల్లో క్షీణతను నమోదు చేశాయి. ప్రధానంగా సెమీకండక్టర్ల కొరత వల్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో చాలా కంపెనీల అమ్మకాలు దెబ్బతిన్నాయి. దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి సోమవారం విడుదలైన గణాంకాల్లో 32 శాతం అమ్మకాలు తగ్గాయని వెల్లడించింది. గతేడాది అక్టోబర్‌లో మొత్తం 1,66,825 యూనిట్లతో పోలిస్తే ఈసారి 1,12,788 కార్లను సరఫరా చేసింది. చిప్‌ల కొరత వల్ల అంచనాల కంటే తక్కువగా అమ్మకాలు ఉన్నాయని కంపెనీ అభిప్రాయపడింది.

మరో దిగ్గజ సంస్థ హ్యుండాయ్ మోటార్స్ మొత్తం 43,556 యూనిట్ల అమ్మకాలతో 37 శాతం క్షీణతను నివేదించింది. కియా మోటార్ ఇండియా అక్టోబర్‌లో 21,021 యూనిట్ల అమ్మకాలు జరిగాయని, ఇది గతేడాదితో పోలిస్తే 22 శాతం తక్కువ అని కంపెనీ తెలిపింది. ఎంజీ మోటార్ ఇండియా అక్టోబర్‌లో సెమీ కండక్టర్ల కొరత కారణంగా ఉత్పత్తి తగ్గిపోవడంతో 24 శాతం క్షీణించి 2,863 యూనిట్లను సరఫరా చేసినట్టు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది ఇదే నెలలో కంపెనీ 3,750 యూనిట్లను రీటైల్‌కు పంపించినట్టు పేర్కొంది.

దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా అక్టోబర్‌లో 41,908 యూనిట్లతో 5 శాతం క్షీణించినట్టు ప్రకటించింది. 2020 అక్టోబర్‌లో సంస్థ మొత్తం 44,359 యూనిట్లను డీలర్లకు పంపింది. హోండా కార్స్ ఇండియా కార్ల అమ్మకాలు 25 శాతం తగ్గి 8,108 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 10,836 యూనిట్లు అమ్ముడయ్యాయని కంపెనీ పేర్కొంది.

టూ-వీలర్ దిగ్గజం హీరో మొటోకార్స్ అమ్మకాలు కూడా అక్టోబర్‌లో 32 శాతం తగ్గి 5,47,970 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఈ కంపెనీ 8,06,848 యూనిట్లను విక్రయించింది. టీవీఎస్ మోటార్ కంపెనీ అక్టోబర్‌లో టూ-వీలర్ అమ్మకాలు 10 శాతం క్షీణించి 3,55,033 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. గతేడాది మొత్తం 3,94,724 యూనిట్లుగా నమోదు చేసింది.



Next Story