సర్వం ‘సర్వే’నే

by  |
సర్వం ‘సర్వే’నే
X

పార్టీలు సర్వేల వెంట పడుతున్నాయి. సర్వే ఫలితాల మీదనే ఆధారపడి ఎన్నికల వ్యూహాన్ని రూపొందించుకోవడంలో టీఆర్ఎస్‌ ముందు వరుసలో ఉంటుంది. స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆరే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతి వేదికపైనా సర్వే ఫలితాలు మనకే అనుకూలంగా ఉన్నాయి అని అంటూ ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ సైతం దుబ్బాక ఉప ఎన్నికలో అదే ఒరవడిని అనుసరిస్తున్నాయి. సర్వేలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. నెల రోజులుగా నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అందులో వచ్చే ఫలితాలను బట్టి ప్రచార వ్యూహాన్ని, ఎత్తుగ డలను రూపొందించుకుంటున్నాయి. ఇతర పార్టీల నుంచి నేతలను టీఆర్ఎస్‌లోకి లాక్కోవడం కూడా ఇందులో భాగమే.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇన్ని అన్ని పార్టీలకు సర్వేలు ప్రధానంగా మారాయి. కొన్ని సర్వేలు మీడియా ద్వారా జరుగుతుండగా మరికొన్ని సోషల్ మీడియా నిపుణుల ద్వారా జరుగుతున్నాయి. ఇక స్వంత పార్టీ కార్యకర్తల ద్వారా కూడా కొన్ని సర్వేలు జరుగుతున్నాయి. నాలుగైదు రోజులకోసారి మండలస్థాయి సర్వే ఫలితాలను మూడు పార్టీల అభ్యర్థులు, సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు. దానికి తగినట్లుగా ప్రచార వ్యూహాలలో మార్పులు చేసుకుంటున్నారు. ఏ గ్రామంలో ఎంత మార్పు వచ్చింది, ఏ సెక్షన్ ప్రజల్లో ఎలాంటి తేడా వచ్చింది, అందుకు గల కారణాలేంటి, ఆ సెక్షన్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు.. ఇలాంటి అంశాలన్నింటినీ లోతుగా విశ్లేషిస్తున్నారు. వారిలో కొత్త విశ్వాసాన్ని కలిగించేలా ప్రచారంలో హామీలు ఇవ్వడం, ప్రత్యర్థి పార్టీల బండారాన్ని బయట పెట్టేలా విమర్శలు చేయడంలాంటివి చోటుచేసుకుంటున్నాయి.

ఫలితాల మీద ఆశతో

టీఆర్ఎస్‌తోపాటు బీజేపీ, కాంగ్రెస్ సర్వే ఫలితాల పట్ల ఆశాజనకంగా ఉన్నాయి. గెలిచినట్లేనని ఒక పార్టీ అనుకుంటూ ఉంటే, గెలుపునకు దగ్గరగా ఉన్నామని మరో పార్టీ అనుకుంటోంది. ఆరు నూరైనా గెలిచేది తామేనని టీఆర్ఎస్ ప్రగాఢ విశ్వాసం. నామినేషన్ కూడా వేయకముందు లక్ష మెజారిటీ అని గొప్పగా చెప్పుకున్నా, ఇప్పుడు 2018 ఎన్నికల్లో వచ్చింత మెజారిటీ అయినా వస్తుందా లేదా అనే డోలాయమానంలో ఆ పార్టీ స్థానిక నేతలు అనుమానపడుతున్నారు. ముందుకంటే పరిస్థితి కాస్త మెరుగుపడినా, కచ్చితంగా గెలుస్తామన్న ధీమా బీజేపీ స్థానిక కార్యకర్తలు, నేతల్లో కనిపించడం లేదు. కాంగ్రెస్ మాత్రం గెలుపు సంగతి ఎలా ఉన్నా ప్రభుత్వ వ్యతిరేకతతో తప్పనిసరిగా గతంకంటే ఎక్కువ ఓట్లు వస్తాయని ఆశిస్తోంది. పరిస్థితి చాలా అనుకూలంగా ఉందని, రెండు మండలాల్లో పూర్తి ఆధిపత్యం తమదేనని నమ్మకంతో ఉంది. ఇదంతా కూడా రోజువారీ, వారాంతపు సర్వేల ప్రభావమే. రోజూ కొద్దిమంది యువత గ్రూపులుగా విడిపోయి సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఎవరు ఏ పార్టీకి చెందినవారో తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు.

సీరియస్‌ ప్రచారం

దుబ్బాక ఉప ఎన్నికలను ఈ మూడు పార్టీలూ చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. అందుకే ఎక్కడ వెలితి ఉంది, దాన్ని ఎలా భర్తీ చేసుకోవాలన్నదానిపై ఫోకస్ పెట్టాయి. స్థానిక సమస్యలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారా లేక సంక్షేమ పథకాలు అందలేదనే అసంతృప్తితో ఉన్నారా లేక అభ్యర్థి వ్యక్తిత్వంపైన అపనమ్మకంతో ఉన్నారా లాంటి ఒక్కో అంశానికి తగినట్లుగా పార్టీల అభ్యర్థులు, సీనియర్ నేతలు అడుగులు వేస్తున్నారు. టీఆర్ఎస్ తరఫున హరీశ్‌రావు పూర్తి బాధ్యతలు తీసుకునన్నారు. ఎమ్మెల్యేలను మండలానికి ఒకరు చొప్పున ఇన్‌చార్జిలుగా నియమించచారు. సర్వే ఫలితాలకు అనుగుణంగా వివిధ వర్గాలవారితో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా హామీలు ఇస్తున్నారు.

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా కొత్తగా నియమితులైన మాణిక్యం ఠాగూర్ దుబ్బాకలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రస్థాయి నేతలందరికీ విడివిడి బాధ్యతలను అప్పజెప్పి వారి పనితీరుకు పరీక్ష పెట్టారు. దీంతో పార్టీ ప్రెసిడెంట్, వర్కి,గ్ ప్రెసిడెంట్ మొదలు మాజీ మంత్రుల వరకు ఒక్కో మండలంలోని గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తూ దుబ్బాక నియోజకవర్గంలోనే మకాం పెట్టారు. ఇంతకాలం ఎడమొఖం పెడమొఖంగా ఉన్న నేతలంతా విడివిడి గ్రూపులుగా చీలిపోయినా దుబ్బాక ఎన్నికల సందర్భంగా సమిష్టి పనివిధానంతో పనిచేయక తప్పడంలేదు. ఇక్కడ గెలుపు ద్వారా పార్టీ బలాన్ని, నాయకుల ప్రభావం, ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న ఆదరణ లాంటివన్నీ తేలిపోనున్నాయి.

కమలం కల తీరేనా

బీజేపీ దుబ్బాక స్థానంపై గంపెడాశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమైనా నాలుగు నెలల వ్యవధిలోనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నాలుగుచోట్ల గెలిచామని గొప్పగా చెప్పుకుంటోంది. ప్రజల్లో నిజంగా మార్పు వల్లనే ఇది సాధ్యమైందని అంటోంది. దుబ్బాకలో సైతం అది ప్రతిబింబించాలి గదా అని టీఆర్ఎస్ నేతలు సవాలు విసురుతున్నారు. నలుగురు ఎంపీలు గెలిచినా దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారంలో మాత్రం పెద్దగా యాక్టివ్‌గా లేరు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నామినేషన్ రోజు కనిపించారు. మళ్లీ రాలేదు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్ ఒక్క రోజు ప్రచారానికి పరిమితం అయ్యారు. ఆదిలాబాద్ ఎంపీ ఇప్పటివరకూ అడుగు పెట్టలేదు. సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు.



Next Story

Most Viewed