పార్లమెంట్ సమావేశాలకు 10 స్క్రీన్లు

by  |
పార్లమెంట్ సమావేశాలకు 10 స్క్రీన్లు
X

న్యూఢిల్లీ: వర్షాకాల సమావేశాలకు పార్లమెంటు సంసిద్ధమవుతున్నది. కరోనా నేపథ్యంలో తొలిసారి విభిన్న సదుపాయాలతో ఉభయ సభలు ముస్తాబవుతున్నాయి. తొలుత ఆన్‌లైన్‌లో సమావేశాలు నిర్వహించాలనే వాదనలు వచ్చినప్పటికీ ఎప్పటిలాగే చట్టసభ్యులందరూ పార్లమెంటుకు హాజరయ్యే విధానాన్నే ఎంచుకున్నారు. దీనికోసం కరోనా ముందుజాగ్రత్తలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశమై నిర్ణయాలు తీసుకున్న సంగతి విధితమే.

ఈ నేపథ్యంలోనే భౌతిక దూరాన్ని పాటించేలా చట్టసభ్యులందరి సీటింగ్‌ అరేంజ్‌మెంట్ సిద్ధమైంది. దీనికి ఉభయ సభల చాంబర్లు, గ్యాలరీలను సీటింగ్‌కోసం వినియోగించుకోనున్నారు. ఏకకాలంలోనే చట్టసభ్యులందరూ సమావేశాల్లో పాల్గొనేలా భారీ స్క్రీన్లు, ఆడియో కన్సోల్స్ ఏర్పాటవుతున్నాయి. పార్లమెంటులోని ఎగువ, దిగువ సభలను అనుసంధానిస్తున్నారు. 85 ఇంచుల నాలుగు పెద్ద సైజు స్క్రీన్లు చాంబర్‌లో ఏర్పాటు చేయనున్నారు.

40 ఇంచుల సైజుగల ఆరు స్క్రీన్లను నాలుగు గ్యాలరీలలో ఏర్పాటు చేయనున్నారు. ఎప్పటికప్పుడు సమావేశాలను స్క్రీన్లలో చూస్తూ అందులో పాల్గొనడానికి వీలుగా ఆడియో కన్సోల్స్ ఏర్పాటు కానున్నాయి. ఇరు సభల్లో ఆడియో-విజువల్ సిగ్నల్స్ సరఫరాకు ప్రత్యేక కేబుల్స్ అనుసంధానించనున్నారు.

అంతేకాదు, ఏసీ సౌకర్యమున్న రాజ్యసభ యూనిట్‌లో వైరస్, సూక్ష్మక్రిములను చంపేసే అల్ట్రా వాయిలెట్ ఇర్రేడియేషన్ సిస్టమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. చాంబర్‌కు సామీప్యంగానున్న అఫిషియల్స్ గ్యాలరీని వేరుచేసేలా పాలీకార్బొనేట్ షీట్లను అమరుస్తున్నారు. రాజ్యసభల్లో అన్నిరకాల ఏర్పాట్లు ఈ నెల మూడో వారంలో పూర్తవ్వాలని చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు ఆదేశించారు.

వచ్చే నెలలో మొదలు కానున్న రాజ్యసభ, లోక్‌సభలు షిఫ్టులవారీగా లేదా రోజు తప్పించి రోజు నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది. లోక్‌సభలోని 542 మంది ప్రస్తుత ఎంపీలలో 168 మంది లోక్‌సభ చాంబర్‌లో ఆసీనులుకాగా, మిగతా చట్టసభ్యులు లోక్‌సభ గ్యాలరీలు, రాజ్యసభలో, రాజ్యసభ గ్యాలరీలలో కూర్చోనున్నారు.

అలాగే, రాజ్యసభలోని 241 మంది ఎంపీలు రెండు సభల చాంబర్‌లలో కూర్చొని సమావేశాల్లో పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, సభాపక్ష నేతలు రాజ్యసభ చాంబర్‌లో ఆసీనులుకానున్నారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్‌డీ దేవేగౌడలతోపాటు రాం విలాస్ పాశ్వాన్, రాందాస్ అథవాలే సహా ఇతర మంత్రులూ ఈ చాంబర్‌లోనే కూర్చోనున్నారు.

అఫీషియల్స్ గ్యాలరీ, ప్రెస్ గ్యాలరీల్లోనూ భౌతిక దూరాన్ని పాటించే సీటింగ్ అరేంజ్‌మెంట్ ఉండనుంది. కాబట్టి సెక్రెటేరియట్ అధికారులు, మీడియా ప్రతినిధులనూ పరిమిత సంఖ్యలోనే అనుమతించనున్నారు. ఈ గ్యాలరీల్లో 15 మందిని మాత్రమే అనుమతించనున్నారు.

ఎగువ, దిగువ సభల్లోనూ ఇప్పటికే అరేంజ్‌మెంట్లున్న రాజ్యసభ టీవీ, లోక్‌సభ టీవీలు లైవ్ టెలికాస్ట్ చేస్తాయి. కరోనా కారణంగా మార్చిలో సమావేశాలు రద్దయిన తర్వాత మళ్లీ సాగలేదు. ఆరు నెలలు పూర్తికావస్తున్న తరుణంలో సెప్టెంబర్‌లో ఈ సమావేశాలను అన్నిరకాలు ముందుజాగ్రత్తల ఏర్పాట్లతో నిర్వహించడానికి సర్కారు సిద్ధమైంది.


Next Story

Most Viewed