హైస్కూల్‌లో భయంకర వాతావరణం.. రాళ్లు, కర్రలతో దాడి

by  |
kOtlata-1
X

దిశ, ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి జెడ్పీ హైస్కూల్ లో విద్యా కమిటీ ఎన్నిక ఉద్రిక్తతలకు దారి తీసింది. విద్యా కమిటీ చైర్మన్ ఎంపిక విషయంలో రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. ఒక వర్గంపై మరోవర్గం రాళ్లు, కర్రలతో దాడి చేసుకోవడంతో జెడ్పీ హైస్కూల్‌లో భయంకర వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే తిరుమాలి జెడ్పీ హైస్కూల్ విద్యాకమిటీ ఎన్నిక సెప్టెంబర్ 22న జరగాల్సి ఉంది. అయితే నాడు విద్యా కమిటీ చైర్మన్‌పై పోటీ నెలకొంది. రెండు వర్గాలు చైర్మన్ పదవిపై పోటీ పడ్డారు. ఎన్నిక జరుగుతుండగా ఇరు వర్గాలు రెచ్చిపోయాయి. రాళ్లు, కర్రలతో పరస్పర దాడులకు దిగారు. దీంతో ఎన్నికను అక్టోబర్ 6కు వాయిదా వేశారు. బుధవారం మరోసారి ఎన్నిక నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు స్కూల్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయినప్పటికీ ఇరువర్గాలు మళ్లీ రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు. ఈ దాడులలో ఒక మహిళా ఉద్యోగితోపాటు కానిస్టేబుల్ గాయపడ్డారు.

ప్రత్తిపాడులోనూ వాయిదా
ప్రత్తిపాడు హైస్కూల్‌లోని విద్యా కమిటీ ఎన్నికలు కూడా మరోసారి వాయిదా పడ్డాయి. గత నెల22న విద్యా కమిటీ ఎన్నికలు జరగాల్సి ఉండగా నాడు పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఎన్నికను అక్టోబర్ 6కు హెచ్ఎం వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో బుధవారం పేరెంట్స్ కమిటీ ఎన్నిక నిర్వహించాలని హెచ్ఎం రమాదేవి ప్రయత్నించారు. అయితే 677 మంది విద్యార్థులకు గాను కేవలం 47 మంది విద్యార్థుల తల్లిదండ్రులే హాజరయ్యారు. కోరం లేకపోవడంతో విద్యా కమిటీ ఎన్నికను మరోసారి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తేదీని త్వరలోనే ప్రకటిస్తామని హెచ్ఎం రమాదేవి స్పష్టం చేశారు.

Next Story

Most Viewed