కాలుష్యం పెరిగితే.. కొవిడ్ విజృంభిస్తుందా?

by  |
కాలుష్యం పెరిగితే.. కొవిడ్ విజృంభిస్తుందా?
X

దిశ, వెబ్‌డెస్క్ :

లాక్‌డౌన్ టైమ్‌లో ప్రపంచవ్యాప్తంగా వాయు, జల కాలుష్యం తగ్గినట్లుగా అనేక నివేదికలు వెల్లడించాయి. కానీ ఆ సంతోషం ఎంతోకాలం లేదు. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత.. అది మరింతగా పెరిగిపోయింది. ఇండియాలోని మెట్రో నగరాల్లో ఎయిర్ పొల్యూషన్ ప్రమాదకర స్థాయిలో ఉంది. కాగా వాయు కాలుష్యం వల్ల కొవిడ్ కేసులు, మరణాలు పెరిగే అవకాశం ఉందని కొన్ని అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి. వాయు కాలుష్యంలో ప్రతీ 2.5 క్యూబిక్ మీటర్ ప్రాణాంతకమైన రేణువులకు ఒక్క మైక్రోగ్రామ్ రేణువులు పెరిగినా 9 శాతం కొవిడ్ మరణాలు పెరుగుతాయని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం చెబుతోంది.

వాతావరణ కాలుష్యానికి కొవిడ్ 19 ఇన్ఫెక్షన్‌కు మధ్య గల సంబంధం గురించి భారతదేశంలో ఇంకా ఎటువంటి అధ్యయనాలు జరగలేదు. అయితే, వైద్య నిపుణులు మాత్రం కాలుష్యం పెరిగితే.. కొవిడ్-19 కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. చలికాలంలో ఢిల్లీతో పాటు అన్ని మెట్రో నగరాల్లోనూ కాలుష్య తీవ్రత పెరిగే చాన్స్ ఉంది. దీంతో కలుషిత వాయివుల ప్రభావంతో ఊపిరితిత్తుల‌ు ఇన్ఫెక్షన్ బారిన పడేందుకు దారి తీస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. పైగా ఇండియాలో ఢిల్లీలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొవిడ్-19కు అత్యధికంగా ప్రభావితమైన నగరాల్లో గాలి కాలుష్యాన్ని సత్వరమే తగ్గించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాలుష్యం ఎక్కువగా ఉండే పారిశ్రామిక ప్రాంతాలు లేదా రద్దీగా ఉండే ప్రాంతాల్లో నివాసముండే వారిని జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చలికాలంలో అలర్జీలు, అస్తమా, జలుబు, దగ్గు తదితర కేసులు కూడా పెరుగుతాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

వాయు కాలుష్యం రోగ నిరోధక శక్తిని తగ్గించడం మాత్రమే కాకుండా, గాలి కాలుష్యంలో ఉండే ప్రమాదకరమైన రేణువులు, వాయువులు కొవిడ్ లాంటి వైరస్‌లు మరింతకాలం సజీవంగా ఉండటానికి, వ్యాప్తి చెందడానికి వాహకాలుగా పని చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు.. వాయుకాలుష్యంలో ఉండే పీఎం 2.5 రేణువులు రక్తంలోకి ప్రవేశించక ముందు ఊపిరితిత్తులను నాశనం చేసి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురిచేస్తాయి. ఇటీవల ఢిల్లీలో పీఎం 2.5 స్థాయిలు సగటున ప్రతీ క్యూబిక్ మీటర్‌కు 180 – 300 మైక్రోగ్రాముల స్థాయికి చేరాయి. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితి కంటే 12 రెట్లు ఎక్కువ. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు వాయు కాలుష్యం తగ్గించే చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉండగా, ప్రజలు సైతం చలికాలంలో మరింత అప్రమత్తంగా ఉంటూ, కాలుష్య వాతావరణంలో తిరగకుండా ఉండేందుకు ప్రయత్నించాలి.


Next Story

Most Viewed