కార్యదర్శుల నిర్వాకం.. ప్రశ్నించిన జ‌ర్న‌లిస్ట్‌పై దాడి

by  |
కార్యదర్శుల నిర్వాకం.. ప్రశ్నించిన జ‌ర్న‌లిస్ట్‌పై దాడి
X

దిశ, ఖ‌మ్మం: క‌రోనా క‌రాళ నృత్యం చేస్తున్న వేళ బాధ్య‌తాయుత‌మైన హోదాలో ఉన్న‌ అధికారులే.. నిబంధ‌న‌ల‌ు తుంగలో తొక్కి నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో పార్టీలు, ఫంక్ష‌న్‌లు అంటూ తెగ హాడావుడి చేశారు. ఈ సంఘ‌ట‌న ఖమ్మం జిల్లా రూరల్ మండలం సబ్ జైల్ సమీపంలో ఆదివారం జ‌రిగింది. ఖ‌మ్మం అర్బన్, రూరల్ మండలాల‌కు చెందిన దాదాపు 30 మంది పంచాయితీ కార్యదర్శులు విధుల్లో చేరి ఏడాది పూర్తయిన సందర్భంగా పార్టీ చేసుకున్నారు. అయితే ఈ కార్య‌క్ర‌మానికి ఎలాంటి అనుమ‌తులు పొంద‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యం స్థానికంగా ఉన్న విలేఖ‌రుల‌కు తెలియ‌డంతో అక్క‌డికి చేరుకున్నారు.

జర్నలిస్టులు పార్టీ ఏర్పాట్ల‌కు సంబంధించిన ఫొటోలు తీస్తుండ‌గా న‌లుగురైదుగురు అధికారులు జర్నలిస్టులపై దాడికి య‌త్నించారు. దుర్భ‌ష‌లాడుతూ.. ఓ మీడియా సంస్థకు చెందిన జ‌ర్న‌లిస్టు సెల్‌ఫోన్ లాక్కుని నేల‌కేసి కొట్టారు. అనంతరం పోలీసులకు స‌మాచారం అందించ‌డంతో ఎక్కడివి అక్కడే వదిలేసి కార్యదర్శులందరూ పారిపోయారు. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో మాస్కులు, సామాజిక దూరం పాటించకుండా, కనీసం అనుమతి లేకుండా బాధ్యత కలిగిన అధికారులే పార్టీలు అంటూ జల్సాలు చేయడం ఏంటని జ‌నం తిట్టిపోస్తున్నారు. కార్య‌ద‌ర్శులు దాడి చేసిన విష‌యాన్ని బాధిత జ‌ర్న‌లిస్టు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed