మూడు నెలల కనిష్టానికి తయారీ రంగం!

by  |
మూడు నెలల కనిష్టానికి తయారీ రంగం!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్ నుంచి నెమ్మదిగా కోలుకున్న భారత తయారీ రంగం మళ్లీ నెమ్మదించింది. అక్టోబర్‌లో మెరుగైన వృద్ధిని నమోదు చేసిన తయారీ రంగ కార్యకలాపాలు నవంబర్‌లో స్వల్పంగా వెనకబడ్డాయి. నవంబర్ నెలకు సంబంధించి భారత మాన్యుఫాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎమై) 56.3 పాయింట్లుగా నమోదైంది. సెప్టెంబర్‌లో తయారీ పీఎంఐ 56.8 గా ఉంది. అక్టోబర్ తయారీ పీఎంఐ 12 ఏళ్ల గరిష్ఠాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, నవంబర్‌లో నెమ్మదించినప్పటికీ తయారీ రంగం పటిష్టంగానే ఉందని ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా నిపుణులు అభిప్రాయపడ్డారు.

సాధారణంగా పీఎంఐ 50 పాయింట్లకు మించి ఉంటే ఆ రంగం వృద్ధిని సాధిస్తున్నట్టు పరిగణిస్తారు. 50 పాయింట్ల లోపు నమోదైతే క్షీణతగా భావిస్తారు. ప్రస్తుత ఏడాదిలో ఫిబ్రవరి నెల తర్వాత సెప్టెంబర్‌లో తయారీ పీఎంఐ 50 పాయింట్లకు మించి నమోదు చేసింది. అనంతరం అక్టోబర్‌లో దశాబ్దానికిపైగా గరిష్ఠంతో నమోదై, నవంబర్‌లో నెమ్మదించింది. అయినప్పటికీ, ఫ్యాక్టరీ ఆర్డర్లు, కొనుగోలు స్థాయి, ఉత్పత్తి, ఎగుమతులు వృద్ధిని నమోదు చేస్తున్నాయని, వినియోగ వస్తువులు భారీగా వృద్ధిని సాధించినట్టు ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా వెల్లడించింది. నవంబర్ నెలలో పీఎంఐ కొంత తగ్గినప్పటికీ భారత ఆర్థికవ్యవస్థ రికవరీ మార్గంలోనే కొనసాగుతోందని ఐహెచ్ఎస్ మార్కిట్ అసోసియేట్ డైరెక్టర్ పొల్యానా డి లిమా చెప్పారు.


Next Story

Most Viewed