కేసీఆర్ మేనల్లుడి నుంచి ప్రాణహాని ఉంది

by  |
కేసీఆర్ మేనల్లుడి నుంచి ప్రాణహాని ఉంది
X

దిశ, క్రైమ్‌బ్యూరో: “సీఎం కేసీఆర్ మేనల్లుడుగా చెప్పుకునే విజయ్ భాస్కరరావు, లేబర్ కాంట్రాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, సైబరాబాద్ పోలీసుల నుంచి నాకు ప్రాణహాని ఉంది” అంటూ బిల్డర్ పాబంది ప్రభాకర్, సరిత దంపతులు మీడియా ముందు వాపోయారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్, మాదాపూర్, నార్సింగి, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ల పరిధిలో నెలరోజులుగా తమపై తప్పుడు కేసులు బనాయిస్తూ మానసికంగా వేధిస్తున్నారంటూ విలేకరుల సమావేశంలో వారు కన్నీటి పర్యాంతమయ్యారు. నాగోలు బండ్లగూడలోని సర్వే నెంబరు 62లో రెండు ఎకరాల మూడు కుంటల భూమిలో బిల్డింగ్ పనులు జరుగుతున్నాయని, కిరణ్ కుమార్ రెడ్డి (లేబర్ కాంట్రాక్టర్) పర్యవేక్షిస్తున్నారని, అయితే తనకు తెలీయకుండానే సైట్ యాజమాని అంటూ చెప్పుకుని 5 ఫ్లాట్లకు రూ.8 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నట్టు ప్రభాకర్ పేర్కొన్నారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని పనిలోంచి తొలగించామని, అయితే సీఎం కేసీఆర్ మేనల్లుడినని చెప్పుకుంటూ విజయభాస్కర్ అనే వ్యక్తి తన భార్యకు ఫోన్ చేసి వివాదాన్ని పరిష్కరిస్తానని చెప్పి అల్వాల్‌కు పిలిపించుకున్నారన్నారు. తన భర్తను ఎన్‌కౌంటర్ చేసేస్తామని బెదిరించి బలవంతంగా రూ. 23కోట్ల విలువైన 34ఫ్లాట్లను వారి పేర్లపై రాసుకుని సంతకాలు చేయించుకున్నారని ప్రభాకర్ భార్య సరిత తెలిపారు.

మా బాస్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్…
రాచకొండ పోలీస్ కమిషనర్‌ని కలిస్తే సివిల్ మేటర్ కోర్టులో తేల్చుకోవాలని చెప్పి పంపారన్నారు. దీంతో ఎల్‌బీ‌నగర్ కోర్టును ఆశ్రయించగా, ఎటాచ్‌మెంట్ బిఫోర్ జడ్జిమెంట్ ఆర్డర్ వచ్చిందని, అప్పట్నుంచి కిరణ్ కుమార్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు. అనంతరం రాజేంద్రనగర్, మాదాపూర్, నార్సింగ్ పోలీస్ స్టేషన్ల అధికారులు తమపై తప్పుడు కేసులు బనాయించారని, పరుష పదజాలంతో తిడుతూ “ఈ కేసు టేకప్ చేసింది ఎవరో తెలుసా? ” అంటూ బెదిరిస్తూ, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఆఫ్ ఇండియా అని భయపెట్టాడని ఆరోపించారు. రూ.50 కోట్లు డిమాండ్ చేశారని, మాదాపూర్ మాజీ సీఐ కూడా కమిషనర్ గారి కేసు కాబట్టి డబ్బు ఇచ్చి సెటిల్ చేసుకోవాలని సలహా ఇచ్చారన్నారు. చివరకు న్యాయస్థాన్ని ఆశ్రయిస్తే అనేక రకాల ఒత్తిడులు వస్తున్నాయని తెలిపారు. తప్పుడు కేసులు బనాయించి రిమాండ్‌కు తరలించారని, మళ్ళీ వాళ్లే బెయిల్ ఇప్పించి 2020 ఏప్రిల్ 12న ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ విజయ్ కుమార్‌ను మేనేజ్ చేసి 34 ఫ్లాట్లకు సంబంధించి సెటిల్ మెంట్ అగ్రిమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వాపోయారు. తమకు, మిత్రులకు సీఎం కేసీఆర్ మేనల్లుడు విజయ్ భాస్కర్ రావు అని చెప్పుకునే వ్యక్తి నుంచి, సైబరాబాద్ పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని, న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను ప్రభాకర్ దంపతులు వేడుకున్నారు.

Next Story