తెలంగాణకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ వచ్చేస్తోంది

by  |
తెలంగాణకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ వచ్చేస్తోంది
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఆక్సిజన్​ ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముమ్మరమవుతున్నాయి. ఇప్పటికే ఒడిశా నుంచి ట్యాంకర్లలో రోడ్డు మార్గాన ఆక్సిజన్​ తీసుకువచ్చారు. ఇప్పుడు రైల్వే నుంచి ఆక్సిజన్​ ట్యాంకర్లు ఒడిశాలోని అన్గుల్​ స్టేషన్​కు పంపించారు. గురువారం ఉదయమే ఈ రైలు రాష్ట్రం దాటింది. సికింద్రాబాద్​ నుంచి ఐదు ఖాళీ ట్యాంకర్లను తీసుకువెళ్లిన రైలు ఉదయం 1‌‌0 గంటల ప్రాంతంలోనే సరిహద్దులోని సిర్పూర్​ కాగజ్​నగర్​ స్టేషన్​ దాటింది. ఇవ్వాళ రాత్రి వరకు అన్గుల్​ స్టేషన్​కు ఈ రైలు చేరుకుంటుందని, రేపు ఉదయం ట్యాంకర్లలో ఆక్సిజన్​ తీసుకుని మళ్లీ ట్యాంకర్లను ఎక్కించుకుని రైలు అక్కడి నుంచి వస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు. శనివారం వరకు ఈ రైలు రాష్ట్రానికి రానుంది. తర్వాత మళ్లీ సమయానుకూలంగా ఈ రైలు ఆక్సిజన్​ ట్యాంకర్లతో ఒడిశాకు పంపించనున్నారు.

కాగా రైల్వే అండర్​ బ్రిడ్జిలు, సాంకేతిక అంశాలన్నీ పరిశీలించుకుని 3.5 మీటర్ల నుంచి 4 మీటర్ల ట్యాంకర్లు ఐదింటిని ఒడిశాకు పంపించారు. ఒక్కో ట్యాంకర్​లో 15 మెట్రిక్​ టన్నులు దాటి ఆక్సిజన్​ ఎక్కించనున్నారు. మొత్తం 60 నుంచి 65 మెట్రిక్​ టన్నుల ఆక్సిజన్​ శనివారం వరకు రాష్ట్రానికి రానుంది. ఇక్కడకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించనున్నారు. ఆ తర్వాత ప్రధానాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులకు ఆక్సిజన్​ను సరఫరా చేయనున్నారు. రాష్ట్రంలో తీవ్ర కొరత ఉన్న నేపథ్యంలో ఆక్సిజన్​ సరఫరాకు అటు రైల్వే, ఇటు ఆర్టీసీని వినియోగిస్తున్నారు.

Next Story

Most Viewed