బాక్సర్ లవ్లీనా పోరాటం వెనక ఉంది ఆమె

by  |
బాక్సర్ లవ్లీనా పోరాటం వెనక ఉంది ఆమె
X

దిశ, ఫీచర్స్ : బాక్సింగ్‌లో భారత బాక్సర్ లవ్లీనా స్వర్ణమో, రజతమో గెలుస్తుందని యావత్ భారతావణి ఆశపడింది. కానీ వరల్డ్ నెంబర్‌వన్ బాక్సర్ టర్కీకి చెందిన బుసెనజ్ చేతిలో ఓడిపోయి ‘కాంస్యా’న్ని సొంతం చేసుకుంది. ఆ కాంస్యమే మనకు గోల్డ్‌మెడల్‌తో సమానం. అద్భుతంగా పోరాడావు లవ్లీనా బోర్గోహైన్ అంటూ భారత ప్రధాని మోదీ కూడా ప్రశంసించాడు. బాక్సింగ్ రింగ్‌లో ఆమె విజయం ఎంతోమంది భారతీయుల్లో స్ఫూర్తి నింపుతుందని, ఆమె పట్టుదల, దృఢసంకల్పం ప్రశంసనీయమంటూ ఆయన లవ్లీనాకు శుభాకాంక్షలు తెలిపాడు. అయితే లవ్లీనా పోరాటం వెనక కోచ్ సంధ్య గురుంగ్ ఉంది. సిక్కింకు చెందిన మాజీ బాక్సర్ సంధ్య తన కలను నెరవేర్చుకునేందుకు పక్షవాతాన్ని సైతం అధిగమించింది. ఆమె సాహస పాఠాలు టోక్యో ఒలింపిక్స్‌లో చారిత్రాత్మక కాంస్య పతకాన్ని గెలుచుకోవడానికి సహాయపడ్డాయి

టోక్యోలో లవ్లీనా పోరును చూసేందుకు భారతీయులంతా ఇష్టపడితే.. గాంగ్‌టక్‌లోని బుర్తుక్ ప్రాంతంలో ఆమె ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందని ఎంతో ఉత్కంఠగా చూస్తుంటుంది ఆమె కోచ్ సంధ్య గురుంగ్. కఠినమైన ప్రత్యర్థులతో ఒత్తడిలో కూరుకుపోకుండా సివంగిలా విరుచుకుపడటానికి ఆమె సాయపడింది. క్వార్టర్ ఫైనల్ పోటీకి బరిలో దిగేముందు లవ్లీనా కోచ్ సంధ్య చెప్పిన తారకమంత్రం “తుమ్ షెర్ని నహీ హో, తుమ్ షేర్ హో’ స్మరించుకోవడం తెలిసిందే. ఒత్తడి ఎదురైనా, ఉత్సాహం తగ్గినా సంధ్య ఎప్పుడూ తన శిష్యురాలికి ఇదే మంత్రం ఉపదేశించేది. ఇక ఆ తర్వాత లవ్లీనా ఆకలిగొన్న పులిలా ప్రత్యర్థిని డిఫెండ్ చేసేది. 2012‌లో సబ్ జూనియర్ క్యాంప్‌లో తొలిసారి లవ్లీనాను కలిసింది సంధ్య. ఆమె కాస్త బెరుకుగా ఉన్నప్పటికీ ఆమె హైట్ ఆమెకు ప్లస్ పాయింట్‌ అని సంధ్య భావించింది. అప్పటి నుంచే లవ్లీనాను ప్రోత్సహిస్తూ, ఆమెలోని భయం తగ్గించడానికి ప్రయత్నించింది సంధ్య. ఇక 2016లో ఢిల్లీలోని నేషనల్ క్యాంప్ నుంచి ఇద్దరి మధ్య బాండింగ్ మరింత బలపడింది.

సిక్కింకు చెందిన మాజీ బాక్సర్ సంధ్య రోడ్డు ప్రమాదానికి గురికాగా, పక్షవాతం వచ్చింది. దాంతో మూడేళ్లపాటు మంచానికే పరిమితమైంది. తన కలల తీరాన్ని చేరుకోవడానికి, రింగ్‌ బరిలో దిగేందుకు పక్షవాతాన్ని అధిగమించి 2000 నుంచి 68 కిలోల విభాగంలో పాల్గొంది. జాతీయ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుని జాతీయ స్థాయి బాక్సర్‌గా ఎదిగిన సంధ్య, 2008లో రిటైర్‌మెంట్ ప్రకటించింది. ఆమె చివరి రింగ్ ప్రదర్శన తర్వాత రాష్ట్ర క్రీడా విభాగంలో ఉద్యోగం రాగా సిక్కిం ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆ సమయంలో క్రీడా మంత్రిగా ఉన్న ప్రేమ్ సింగ్ గోలే తనను కోచ్‌గా మారేందుకు ప్రోత్సహించారు. 2010 నాటికి ఆమె కోచ్ డిప్లొమా పొందడంతో ఆనాటి నుంచి పోరాట యోధులకు శిక్షణ ఇస్తోంది.

‘2013 లో ఆమె సబ్-జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌కు వెళ్లినప్పటి నుంచి ఆమె లక్ష్యం ఎల్లప్పుడూ ఒలింపిక్స్ పైనే ఉండేది. ఆమె మొదట 75 కేజీల విభాగంలో ఆడగా, ఒలింపిక్స్ కోసం 69 కేజీల విభాగానికి మారింది. లవ్లీనాలో అన్నీ అర్హతలున్నాయి కానీ ఆమెను భయం వెంటాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బలహీనమైన ప్రత్యర్థులపై గెలవడం తేలికే కానీ అసలైన ప్రత్యర్థి ఎదురైనప్పుడు భయాందోళన చెందుతుంది. దాంతో ముందు భయంతో పోరాడాలని సూచించాను. రియో ఒలింపిక్స్ తర్వాత 2016లో నేషనల్ క్యాంప్‌ సందర్భంలో తదుపరి ఒలింపిక్స్ కోసం మేం సిద్దమయ్యాం. ఆమెను సివంగిలా తీర్చిదిద్దడానికి బరిలో దిగిన సింహానివి నువ్వంటూ ప్రోత్సహించాను.
– కోచ్ సంధ్య


Next Story