రెండు నెలల్లో 4 కోట్ల మంది అసంఘటిత కార్మికుల వివరాలు నమోదు

by  |
Cycle1
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమం కోసం ప్రారంభించిన ఈ-శ్రమ్ పోర్టల్‌లో రెండు నెలల్లో 4 కోట్ల మందికి పైగా కార్మికులు నమోదు చేసుకున్నారని కార్మిక మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. వ్యవసాయం, నిర్మాణ రంగ కార్మికుల నుంచి అత్యధిక మంది ఇందులో వివరాలను పొందుపరిచారని మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా గణాంకాల ప్రకారం.. మొత్తం 4.09 కోట్ల మంది ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారని… వీరిలో దాదాపు 50.02 శాతం మంది స్త్రీలు ఉన్నారని, 49.98 శాతం మంది పురుషులు ఉన్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అసంఘటిత కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్‌లో వివరాలను నమోదు చేయడం ద్వారా ప్రభుత్వం వారికి పథకాల ప్రయోజనాలు అందించడం సులభమవుతుందని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పేర్కొంది. వ్యవసాయ, నిర్మాణ రంగాలు కాకుండా ఈ పోర్టల్‌లో దుస్తులు, తయారీ, ఫిషింగ్, వీధి కార్మికులు, ఇంటి పని, వ్యవసాయ అనుబంధ, రవాణ సహా విభిన్న వృత్తుల్లోని కార్మికులు ఇందులో నమోదు చేసుకున్నారని, నమోదు చేసుకున్న వారిలో దాదాపు 65.68 శాతం మంది 16-40 ఏళ్ల లోపు వారున్నారని, 34.32 శాతం మంది 40-అంతకంటే ఎక్కువ వయసు వారున్నారని తెలిపింది.


Next Story

Most Viewed