పార్లమెంటులో ‘ఢిల్లీ హింస’ను లేవనెత్తుతాం

by  |
పార్లమెంటులో ‘ఢిల్లీ హింస’ను లేవనెత్తుతాం
X

న్యూఢిల్లీ : పార్లమెంటులో రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఢిల్లీ హింసను లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అలాగే, అల్లర్లను నియంత్రించడంలో విఫలమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని బలంగా డిమాండ్ చేయనున్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లో ఢిల్లీ హింసపై చర్చపెట్టాలని కాంగ్రెస్ యోచిస్తున్నది. ఢిల్లీ హింసను పార్లమెంటులో లేవనెత్తుతామని కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి చెప్పారు. అల్లర్లు ఎందుకు జరిగాయో ప్రశ్నిస్తామని తెలిపారు. దేశరాజధానిలో శాంతిభద్రతల పర్యవేక్షణలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఇది తీవ్రమైన అంశమని అన్నారు. అమిత్ షా రాజీనామా డిమాండ్‌ను అలాగే కొనసాగిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌తోపాటు సీపీఐ, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు అల్లర్లపై కేంద్ర హోం మంత్రిని నిలదీయనున్నట్టు సమాచారం. పార్లమెంటులో బడ్జెట్ సెషన్ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11వరకు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో విడత సమావేశాలు మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు సాగనున్నాయి.

Next Story