విద్యుత్​ చార్జీల పెంపుపై అభిప్రాయ సేకరణ

by  |
Ministers Jagadish Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో డిస్కమ్‌లు నష్టాలను పూడ్చుకునే పనిలో నిమగ్నమయ్యాయి. తెలంగాణలో విద్యుత్​చార్జీల పెంపుపై ఏం చేయాలనే ఆలోచనలో టీఆర్ఎస్​ప్రభుత్వం పడింది. ఈ అంశంపై వరుసగా మూడో రోజు విద్యుత్ యాజమాన్యాలతో మంత్రులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, హరీశ్​రావు బుధవారం బీఆర్కే భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ఇతర రాష్ట్రాల ధరలతో ఇక్కడి ధరలను పోల్చి చూసినట్లు తెలిసింది. అక్కడితో పోల్చితే మన రాష్ట్రంలో ధరలు చాలా తక్కువగా ఉన్నట్లుగా వారు పేర్కొన్నారు. 50 యూనిట్లలోపు విద్యుత్ ను వినియోగించుకున్న వారికి యూనిట్​కు రూ.1.45 పైసలకే కరెంట్​సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

డిస్కంల నష్టాలు పూడ్చేందుకు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ప్రతిఏటా రూ.1253 కోట్ల చొప్పున రూ.10 వేల కోట్లు కేటాయించినా ఈ నష్టాలు తప్పలేదని అధికారులు అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో 50 యూనిట్లలోపు కరెంట్​వినియోగించుకునే వారి నుంచి రూ.3.30 వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో రూ.3, పంజాబ్‌లో రూ.3.49 పైసలు, అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో రూ.4.02 వసూలు చేస్తున్నట్లుగా ప్రస్తావించారు. రాష్ట్రంలో 100 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించుకునే వినియోగదారుల సరాసరి బిల్లు రూ.239 ఉంటే ఇతర రాష్ట్రాల్లో కనీసం రూ.600 నుంచి రూ.900 వరకు వసూలు చేస్తున్నట్లు చర్చకు వచ్చింది. తెలంగాణలో 200 యూనిట్లలోపు విద్యుత్​వినియోగిస్తున్న వారి నుంచి రూ.822 వసూలు చేస్తుండగా.. ఇతర రాష్ట్రాల్లో రూ.1200 నుంచి రూ. రూ.1700 వరకు ఉన్నట్లు చర్చకు వచ్చింది.

తెలంగాణ డిస్కమ్‌లు ఒక్కో యూనిట్ సరఫరా వ్యయం రూ.7.24 పైసలు పడుతుండగా 50 యూనిట్ల లోపు వినియోగదారులకు రూ.1.45, 100 యూనిట్లకు రూ.2.60, 200 యూనిట్లకు రూ.4.30 గృహ వినియోగదారుల నుంచి వసూలు చేస్తోంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని అధికారులు, మంత్రులు పేర్కొన్నారు. ఉదాహరణకు సబ్సిడీ లేకపోతే 50 యూనిట్లు వినియోగించుకుంటున్న గృహ వినియోగదారులు చెల్లించాల్సిన మొత్తం 362 రూపాయలు, కానీ 101 రూపాయలు మాత్రమే వసూలు చేస్తోంది. 100 యూనిట్లు వినియోగించే వారు చెల్లించేది రూ.239. అయితే సబ్సిడీలు లేకుంటే వారు చెల్లించాల్సింది రూ.724 ఉంటుందని మంత్రులు, అధికారులు వెల్లడించారు.

వ్యవసాయ రంగానికి అందించే విద్యుత్​పై సైతం ఈ సమీక్షలో చర్చించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే డిస్కంల నష్టాలను పూడుస్తూ.. ఆదాయం పెంచుకోవడంపై ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని చర్చించారు. ఈ సమావేశంలో ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, టీఎస్​ఎస్పీడీసీఎల్​సీఎండీ రఘుమారెడ్డి, జేఎండీ శ్రీనివాసరావు, టీఎస్​ఎస్పీడీసీఎల్​డైరెక్టర్ శ్రీనివాస్, స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed