‘ఆపరేషన్ కగార్‌’కు తాత్కాలిక బ్రేక్.. కేంద్రం సంచలన ఆదేశాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-10 06:14:27  IST  )

పాకిస్థాన్‌తో ప్రత్యక్ష యుద్ధానికి భారత్ సిద్ధమవుతోన్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

‘ఆపరేషన్ కగార్‌’కు తాత్కాలిక బ్రేక్.. కేంద్రం సంచలన ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్/వరంగల్ బ్యూరో: పాకిస్థాన్‌తో ప్రత్యక్ష యుద్ధానికి భారత్ సిద్ధమవుతోన్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చేపడుతోన్న ‘ఆపరేషన్ కగార్’కు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించారు. పాక్‌తో యుద్ధంలో పాల్గొనేందుకు సీఆర్‌పీఎఫ్ బలగాలను వెనక్కి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం కర్రెగుట్టల్లో కూంబింగ్‌లో ఉన్న సీఆర్‌పీఎఫ్ జవాన్లు అంతా రేపు ఉదయంలోగా హెడ్ క్వార్టర్‌లో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో భద్రతా బలగాలు హుటాహుటిన భారత సరిహద్దుకు పయనమయ్యారు.

కాగా, క‌ర్రిగుట్టల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు దాగి ఉన్నార‌నే స‌మాచారంతో గ‌త మూడు వారాలుగా సీఆర్‌పీఎఫ్, స్పెషల్ ఫోర్సెస్ బ‌ల‌గాలు కూంబింగ్ నిర్వహిస్తున్న విష‌యం తెలిసిందే. మూడు రోజుల క్రితం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ క‌మాండోలు మృతి చెంద‌గా మ‌రో ముగ్గురు గాయ‌ప‌డ్డారు. ములుగు జిల్లా వాజేడు మండ‌ల పరిధిలోని పెద్ద గుట్టకు సమీపంలో లంకెప‌ల్లి గ్రామ అట‌వీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జ‌రిగింది. ఆ కాల్పుత త‌ర్వాత మావోయిస్టుల‌పై ఖ‌చ్చితంగా ప్రతికార దాడి ఉంటుంద‌న్న అంచ‌నాలు, ఊహాగానాలు న‌డుస్తున్నాయి. ఈ క్రమంలోనే భార‌త్‌- పాక్ మ‌ధ్య యుద్ధం ప్రారంభ‌మైన నేప‌థ్యంలో క‌గార్ ఆప‌రేష‌న్‌కు బ్రేక్ ఇవ్వాల‌నే యోచ‌న‌తో కేంద్ర ప్రభుత్వం సీఆర్‌పీఎఫ్ బ‌ల‌గాల‌ను వెన‌క్కి రావాల‌ని ఆదేశించిన‌ట్లుగా తెలుస్తోంది. సీఆర్పీఎఫ్ బ‌ల‌గాలత పాటు కోబ్రా బృందాలను కూడా వెంట‌నే వారి కార్యాల‌యాల్లో రిపోర్టు చేయాల‌ని ఆదేశించారు.

సీఆర్‌పీఎఫ్ బల‌గాలను పాక్ స‌రిహ‌ద్దు రాష్ట్రాలైన గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌, జ‌మ్ము, క‌శ్మీర్ వంటి రాష్ట్రాల‌కు పంప‌నున్నట్లు తెలుస్తోంది. దీంతో ములుగు, భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని వెంక‌టాపురం, వాజేడు, చ‌ర్ల ప్రాంతంలోని క‌ర్రిగుట్టలపై బేస్ క్యాంపులు ఏర్పాటు చేసిన సీఆర్‌పీఎఫ్ బృందాలు శ‌నివారం ఉద‌యం నుంచి వెనుదిరిగే ప‌నిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ, ఒకేసారి కాకుండా ద‌శ‌ల వారీగా బలగాలు వెనక్కి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా స‌మాచారం. గుట్టల మీద నుంచి భద్రతా బలగాలు సేఫ్‌గా కింద‌కు వ‌చ్చేంత వ‌ర‌కు అక్కడ భారీ సంఖ్యలో బందోబస్తు ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ‘ఆపరేషన్ కగార్‌’కు తాత్కాలిక‌మైన విరామేన‌ని తెలుస్తుండ‌గా.. తాజా ప‌రిణామంతో అక్కడున్న ఆదివాసీలు మాత్రం ఊపిరి పీల్చుకుంటున్నారు.

Next Story