Shehbaz Sharif: అవును.. మాపై దాడులు జరిగాయి- పాక్ ప్రధాని

by Shamantha N |

పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’ చేపట్టింది. దాయాదిపై భారత సాయుధ దళాలు విరుచుకుపడ్డాయి.

Shehbaz Sharif: అవును.. మాపై దాడులు జరిగాయి- పాక్ ప్రధాని
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’ చేపట్టింది. దాయాదిపై భారత సాయుధ దళాలు విరుచుకుపడ్డాయి. మిస్సైల్స్ లో కీలక వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయి. అయితే, ఈ నష్టంపై ఇప్పటివరకు పెదవి విప్పని పాక్ ఇప్పుడు స్పందించింది. పాక్ పై దాడులు జరిగినట్లు అంగీకరించింది. భారత క్షిపణుల దెబ్బ తమకు తగిలిందని స్వయంగా ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ (Shehbaz Sharif) ధ్రువీకరించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయంపై షెహబాజ్ మాట్లాడారు. మే 9-10 మధ్య రాత్రి సమయంలో రావిల్పిండిలోని నూర్ ఖాన్‌ సహా ఇతర వైమానిక స్థావరాలపై భారత్‌ దాడి చేసినట్లు పాక్‌ ప్రధాని అంగీకరించారు. ఆయన మాట్లాడుతూ..‘‘ ఆ రోజు ఉదయాన్నే ప్రార్థనలు పూర్తయ్యాక ఈత కొట్టేందుకు వెళ్లా. నా సెక్యూర్డ్‌ ఫోన్‌ మాత్రమే తీసుకెళ్లా. రెండు సార్లు మోగింది. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌ లైన్‌లో ఉన్నారు. ఫోన్‌ ఎత్తగానే భారత్‌ దాడులు చేస్తున్న విషయాన్ని చెప్పారు. వాటిని ఎదుర్కొనేందుకు వైమానిక దళం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు చైనా యుద్ధ విమానాలను కూడా వాడుతోందని మునీర్‌ తెలిపారు’’ అంటూ షెహబాజ్ వివరించారు. అయితే, భారత్‌పై పాక్‌ ప్రయోగించిన మిస్సైల్స్, డ్రోన్లు కూలిపోయిన విషయాన్ని మాత్రం ఆయన చెప్పకపోవడం గమనార్హం. మరోవైపు, షెహబాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆపరేషన్ సిందూర్..

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత్ పై పాక్ దాడులు చేపట్టింది. సైనిక స్థావరాలు, పౌర నివాసాలను లక్ష్యంగా చేసుకుని పాక్‌ దాడి చేసింది. దీంతో న్యూఢిల్లీ ప్రతిదాడికి దిగింది. అత్యంత కచ్చితత్వంతో పాక్‌లోని దాదాపు డజను సైనిక స్థావరాలను భారత్‌ ధ్వంసం చేసింది. ఇందులో ఆ దేశానికి అత్యంత కీలకమైన పాక్‌ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ ఉన్న చక్లాలలోని నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌తో పాటు సర్గొదా, భోలారీ వైమానిక స్థావరాలున్నాయి. అయితే, దాడుల్లో ఇవి ధ్వంసమైన తీరు శాటిలైట్ పిక్చర్స్ తో బయటకొచ్చింది.

Next Story