ఆన్ లైన్ అప్పు.. ప్రాణాలకు ముప్పు

by  |
ఆన్ లైన్ అప్పు.. ప్రాణాలకు ముప్పు
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: మీకు డబ్బు అవసరం ఉందా..? మీకు కావాల్సిన డబ్బు మేమిస్తామంటూ మీ మొబైల్స్‌కు మెసేజ్‌లు వస్తున్నాయా..? తక్కువ వడ్డీ.. ష్యూరిటీలు అవసరం లేదని చెబుతున్నారా..? ఆఫర్‌ ఏదో బాగుంది కదా అని ఆ డబ్బు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే జరభద్రం. మీరు ఏ మాత్రం అనాలోచిత నిర్ణయం తీసుకున్నా.. ఆ అప్పు మీ ప్రాణాలకే ముప్పుగా మారొచ్చు.

సైబర్‌ నేరగాళ్లు, ఆర్థిక మోసాలకు పాల్పడే నేరగాళ్లు ఆన్‌లైన్‌ క్రెడిట్‌ యాప్‌ అంటే ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌ పేరుతో యువతను ఉచ్చులోకి లాగుతున్నారు. ఎక్కడో ఉంటూ ఆన్‌లైన్‌లో కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఈ నేరగాళ్లు గో క్యాష్‌, స్మాల్‌ వ్యాలెట్‌, బబుల్‌ లోన్, బిలియన్‌ క్యాష్, లోన్‌ బజార్‌ వంటి పేర్లతో వందలాది యాప్‌లను రూపొందించి గూగుల్‌ ప్లే స్టోర్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఆన్‌లైన్‌లో ఎక్కువసేపు గడిపే వారికి ఆయా యాప్స్‌ లింక్‌లను పంపిస్తారు. వాటిని ఓపెన్‌ చేయగానే ఫొటో, ఆధార్‌ కార్డుతోపాటు సెల్‌ఫోన్‌లో గూగుల్‌ డ్రైవ్‌కు సింక్‌ అయిన కాంటాక్టు నంబర్లు తమకు మెయిల్‌ చేస్తే తక్షణం రూ.3వేలు నుంచి రూ.20వేలు వరకూ రుణం ఇస్తామంటారు. రుణంలో పదిశాతం ప్రాసెసింగ్‌ చార్జీల కింద కోత విధించి మిగిలిన మొత్తాన్ని గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం ద్వారా పంపిస్తారు. రుణం తీర్చేందుకు 15నుంచి 20 రోజులు మాత్రమే గడువు ఇస్తారు. గడువులోగా రుణం తీర్చకపోతే వారి తల్లిదండ్రుల నంబర్లకు ఫోన్‌ లేదా వాట్సాప్‌ ద్వారా కాంటాక్టులోకి వెళ్లి మీ వాళ్లు మా దగ్గర రుణం తీసుకుని తిరిగి చెల్లించడం లేదు. కాబట్టి, మీరు ఆ మొత్తాన్ని చెల్లించాలి అంటూ ఒత్తిడి చేస్తారు. అప్పు తీర్చని పక్షంలో మీరు ఇచ్చిన ఫోన్‌ నంబర్లకు కాల్‌ చేసి అందరికీ విషయం చెబుతామంటూ బ్లాక్‌ మెయిల్‌ చేస్తారు.

ఆర్థిక అవసరాలే లక్ష్యంగా..

మనిషి ఆర్థిక బలహీనతలను క్రెడిట్ యాప్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. మీకు క్షణాల్లో అప్పు ఇచ్చి ఆపదలో ఆదుకుంటామంటూ నోటిఫికేషన్లు ఇస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. విద్యార్థులు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని తమ దందాను కొనసాగిస్తున్నాయి. ఇలా అప్పులు తీసుకున్న బాధితుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఆన్ లైన్ లో యాప్ ల ద్వారా లోన్లు ఇచ్చి అధిక వడ్డీ వసూలు చేయడం, కట్టకపోతే వాళ్ల ఫోన్ కు కాంటాక్ట్ లో ఉన్నవారందరికి అసభ్యంగా మెసేజ్ లు పెడుతూ వేధిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో తరచూ బయటపడుతున్నాయి. వీరిలో బాధితులు కొందరు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా, ఈ వేధింపులు భరించ లేక మరికొంత మంది బాధితులు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కామారెడ్డికి చెందిన గుజ్జ చంద్రమోహన్(38) బలవన్మరణానికి పాల్పడ్డాడు.

లోన్‌ కట్టకపోతే బతకడం వేస్ట్..

కామారెడ్డికి చెందిన గుజ్జ చంద్రమోహన్(38) బతుకు దెరువు కోసం భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నగరానికి వచ్చాడు. కొంతకాలంగా ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. డబ్బు అత్యవసరం కావడంతో ఓ క్రెడిట్ యాప్ లో రూ.5వేలు రుణం తీసుకున్నాడు. టైంకు చెల్లించడం లేదని వడ్డీ మీద వడ్డీలు వేశారు. కొద్ది రో జులకే రూ.30 వేలయిందని నిర్వాహకులు చెప్పడంతో చేసేదేమీలేక గడువు కావాలని కోరాడు. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ మిత్తీ పెరిగి రూ.5లక్షలకు చేరిందని తెలువడంతో ఇంట్లోని నగలు విక్రయించడంతోపాటు ఉన్న రెండు క్రెడిట్ కార్డుల ద్వారా అప్పు తీసుకుని రూ.2.5లక్షల వరకు చెల్లించాడు. మిగతా డబ్బు కూడా కట్టాలని వేధించడంతో సైబర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా ఫోన్ స్విచాఫ్ చేయాలని తెలుపడంతో బంద్ చేశాడు. బాధితుడు ఫోన్ స్విచ్ఛాప్ చేయడంతో యాప్ నిర్వహకులు చంద్రమోహన్ ఫోన్ లోని కాంటాక్ట్ లకు మెసేజ్ పంపించారు. బంధువులకు, స్నేహితులకు ఫోన్లు చేసి బూతులు తిట్టారు. విషయం తెలుసుకున్న చంద్రమోహన్, భార్య పిల్లలను పుట్టింటికి పంపి, ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఈ నెల 2న సూసైడ్ చేసుకున్నాడు.



Next Story

Most Viewed