ఆన్‌లైన్‌లో 'దళిత బంధు' అప్లికేషన్.. దరఖాస్తుకు ప్రత్యేక యాప్

by  |
ఆన్‌లైన్‌లో దళిత బంధు అప్లికేషన్.. దరఖాస్తుకు ప్రత్యేక యాప్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్తగా దళితబంధు పథకాన్ని ప్రకటించింది. పేద దళితులకు ఆర్థిక సాయం చేసేందుకు ఈ పథకం ప్రారంభించనుండగా.. తొలుత రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 మంది పేద దళితులను ఎంపిక చేసి రూ.10 లక్షలు అందించనుంది. త్వరలో ఉపఎన్నికలు జరగనున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోని హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఈ పథకం ప్రారంభించేందుకు ప్రభుత్వ యాంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.

అయితే ఈ పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుంది. దీని కోసం ఒక ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు ఈ బాధ్యతలు అప్పగించింది. యాప్‌తో పాటు వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. లబ్ధిదారులు నేరుగా వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా అప్లై చేసుకునే సౌలభ్యం కల్పించనున్నారు.

ఈ నెలాఖరులోగా యాప్, వెబ్ సైట్ సిద్ధం చేయనుండగా.. ఆగస్టు తొలివారం నుంచి అందుబాటులోకి రానుంది. లబ్ధిదారులు అప్లై చేసుకున్న తర్వాత దరఖాస్తులను అధికారులు పరిశీలించి జాబితా రూపొందించనున్నారు. లబ్ధిదారులకు నేరుగా అకౌంట్లో డబ్బులు జమ చేయనున్నారు. ఈ నెల 26న దళిత బంధు అవగాహన కార్యక్రమం సీఎం కేసీఆర్ నిర్వహించనున్నారు. అనంతరం విధివిధానాలపై స్పష్టత వచ్చే అవకాశముంది.

Next Story