ప్రాణం తీసిన మతిమరుపు

by  |
ప్రాణం తీసిన మతిమరుపు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: పంచర్ షాప్‌లో గాలి సిలిండర్ పేలి ఒకరు దుర్మరణం పాలు కాగా మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలైన సంఘటన గురువారం హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… బజార్‌ఘాట్ ప్రాంతంలో నివాసం ఉండే మహమ్మద్ ఆసిఫ్‌కు నాంపల్లి ఏరియా ఆసుపత్రి వద్ద పంచర్ షాప్ ఉంది. దీనిని ఇటీవల జిర్రాకు చెందిన మహమ్మద్ యాసీన్ (17)కు లీజుకు ఇచ్చాడు. రోజు మాదిరిగానే యాసీన్ గురువారం ఉదయం షాపు వద్ద పని చేసుకుంటూ సిలిండర్‌లో గాలి నింపేందుకు మోటార్ ఆన్ చేశాడు. అనంతరం ఆఫ్ చేయడం మర్చిపోవడంతో గాలి సిలిండర్లో పూర్తిస్థాయిలో నిండి ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పేలింది.

ఇదిలా ఉండగా పంచర్ షాప్ పక్కనే బీహార్ నుంచి ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి నాంపల్లిలో నివాసముంటున్న ప్రతాప్ సింగ్ పక్కనే సులబ్ కాంప్లెక్స్ నిర్వహిస్తున్నాడు. ఇదే సమయంలో మనోరంజన్(40) అనే వ్యక్తి పని కావాలంటూ అక్కడికి వచ్చాడు. వారు మాటల్లో ఉండగా పక్కనే గాజుల వ్యాపారం చేసే మహమ్మద్ అస్లాం(30) సులబ్ కాంప్లెక్స్ వద్దకు వచ్చాడు. ఈ ముగ్గురు సులబ్ కాంప్లెక్స్ వద్ద ఉండగానే పంచర్ షాప్‌లో సిలిండర్ పేలడంతో, మనోరంజన్ శరీరంలోకి సిలిండర్ శిథిలాలు దూసుకుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. అస్లాం, యాసిన్, ప్రతాప్ సింగ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హబీబ్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story